Prashant Kishor: సంచలన నిర్ణయం.. స్వంత కుంపటి?

Pk

Pk

ఇప్పుడు దేశమంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అడుగుల గురించే చర్చ సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకుంటారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నేడు ఆయన పార్టీని ప్రకటించనున్నట్టు కూడా ఉత్తరాది రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ట్విట్టర్‌లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని, తన సత్తా ఏంటో చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా బీహార్‌లో ఆదివారం ఆయన భావసారూప్య పార్టీలతో చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని గతంలో వార్తలు వచ్చాయి. అయితే పీకే ప్రతిపాదనలకు ఎంతో చరిత్ర వున్న కాంగ్రెస్ ససేమిరా అనడంతో ఏంచేయాలో తోచలేదు. పార్టీని ప్రక్షాళన చేసి జవసత్వాలు నింపేందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే, పార్టీలోకి ఆయన రాకను కాంగ్రెస్‌ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకించడంతో డామిట్.. కథ అడ్డం తిరిగింది. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ దేశంలోని వివిధ పార్టీలకు పనిచేస్తుండడం, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పీకే చర్చలు జరపడంతో ఆయన తీరుపై కాంగ్రెస్ నేతలు కూడా సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్‌లో పీకే చేరికకు ద్వారాలు మూసుకుపోయాయి.

అసలే ప్రజాస్వామ్యం ఎక్కువగా వుండే శతాబ్దాల చరిత కలిగిన కాంగ్రెస్ పార్టీలో పీకే తరహా ఆలోచనలు వర్కవుట్ కావు. పీకే తాను గీసిన గీతలో నిలబడాలంటే కాంగ్రెస్ లో ఎవరూ ఒప్పుకోరు. మేమింతే.. మేమలాగే వుంటాం అనే ధోరణిలో కాంగ్రెస్ నేతలు వుంటుంటారు. ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరి, పీకే ఏ దారిలో వెళతారో.. ఆయన పార్టీ జెండా ఏంటో…ఆయన ఎజెండా ఏంటనేది త్వరలో తేలిపోనుంది.

JP Nadda : ఈ నెల 5న మహబూబ్‌నగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు