Prashant Kishor: నా సంకల్పం నెరవేరేదాకా వెనక్కి తగ్గేదే లే.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన

  • నా సంకల్పం నెరవేరేదాకా వెనక్కి తగ్గేదే లే
  • ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన
Prashant Kishor

Prashant Kishor

బీహార్ ప్రజల విశ్వాసాన్ని జన్ సురాజ్ పార్టీ గెలుచుకోలేకపోయిందని ఆ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. మా ఆలోచనల్లో ఏదో తప్పు జరిగి ఉంటుందని.. ఓటమి పూర్తి బాధ్యత తనదేనన్నారు. 100 శాతం ఆ బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు చెప్పారు. బీహార్ రాజకీయాలను మారుద్దామని కొత్త పాత్ర పోషించామని.. కానీ ప్రజలు తమను కోరుకోలేదన్నారు. మా ఆలోచనల్లో ఎక్కడో.. ఏదో జరిగి ఉంటుందని అనుకుంటున్నట్లు వాపోయారు. చాలా నిజాయితీగా ప్రయత్నించామని… కానీ అది పూర్తిగా విఫలమైందని చెప్పారు. దీన్ని అంగీకరించడంలో ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Nitish Kumar: 20నే సీఎంగా నితీష్ ప్రమాణం.. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు

గత మూడేళ్లుగా ఎంతగా పని చేశానో అందరికీ తెలిసిందేనని.. తన శక్తినంతా ధారపోసినట్లు చెప్పుకొచ్చారు. అయినా వెనక్కి తగ్గే ప్రశ్నేలేదన్నారు. బీహార్‌ను మెరుగుపరచాలనే తన సంకల్పం నెరవరే వరకు ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: DK Shivakumar: ఆ ప్రశ్న జ్యోతిషుడిని అడగండి.. డీకే.శివకుమార్ అసహనం

బీహార్ ప్రజలు ఏ ఆధారంగా ఓటు వేయాలి.. కొత్త వ్యవస్థ ఎందుకు అవసరమో వివరించి చెప్పడంలో తాను విఫలమైనట్లు ఒప్పుకున్నారు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఈనెల 20న గాంధీ భీతిహర్వా ఆశ్రమంలో ఒక్కరోజు మౌన ఉపవాసం ఉండబోతున్నట్లు ప్రకటించారు. తప్పులు చేసి ఉండొచ్చు.. కానీ ఎలాంటి నేరం చేయలేదన్నారు. సమాజంలో కుల ఆధారిత ద్వేషాన్ని వ్యాప్తి చేసే నేరం చేయలేదని వివరించారు. ఎక్కడా కూడా హిందూ-ముస్లిం రాజకీయాలు చేయలేదని పేర్కొ్న్నారు. మతం పేరుతో ప్రజలను విభజించే నేరం చేయలేదని స్పష్టం చేశారు. బీహార్‌లోని పేద, అమాయక ప్రజలకు డబ్బు ఇచ్చి ఓట్లు కొనే నేరం ఏ మాత్రం చేయలేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేదు. పైగా డిపాజిట్ కోల్పోయింది. అధికారంలో వస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రశాంత్ కిషోర్‌కు బీహారీయుల నుంచి భంగపాటు ఎదురైంది.