NTV Telugu Site icon

గవర్నర్‌గా మాజీ సీఎం యడియూరప్ప..?

Yediyurappa

Yediyurappa

రాజీనామా వ్యవహారంపై వస్తున్న వార్తలను ఖండిస్తూనే వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. చివరకు రాజీనామా చేశారు.. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, కొత్త సీఎంను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను కోరారు గవర్నర్.. ఇక, యడియూరప్ప వారసుడు ఎవరు? కర్ణాటక సీఎం పీఠంపై కూర్చోబోతున్న కొత్త వ్యక్తి ఎవరు అనేదానిపై బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది.. ఇదే సమయంలో.. యడియూరప్పకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి ఆశచూపినట్టు కూడా ప్రచారం సాగుతోంది.. ఏపీ లేదా మరో రాష్ట్రానికి గవర్నర్ గా యడియూరప్పను నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం..

ఇప్పటికే కేంద్ర కేబినెట్‌ నుంచి తప్పించి మరీ గవర్నర్‌ నియమించిన ఘటనలు ఉన్నాయి.. వివిధ రాష్ట్రాల్లోనూ పార్టీ సీనియర్లకు కూడా గవర్నర్లను చేసింది బీజేపీ అధిష్టానం.. అదే కోవలో.. యడియూరప్పను కూడా గవర్నర్‌గా పంపే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, దీనిపై స్పందించిన యడియూరప్ప.. తాను ఎక్కడికీ వెళ్లనని, రాష్ట్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు.. తన రాజీనామాపై హైకమాండ్ నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని కూడా చెప్పుకొచ్చారు.. తాను ఎలాంటి పదవులూ కోరుకోవడం లేదని, గవర్నర్ గా వెళ్లడం ఇష్టం లేదని తెలిపారు.. మరీ ఈ కర్ణాటక ఎపిసోడ్‌కు ఎప్పుడు తెరపడుతుంది.. యడియూరప్పను ఎలాంటి పదవి వరించబోతోంది? అనేది వేచిచూడాలి.