మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంపై లోక్సభలో మోడీ మాట్లాడారు. ‘‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అపారమైనవి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నారు. గత రెండు మూడు వారాలుగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ పూరి సభకు పశ్చిమాసియా పరిస్థితిపై సవివరంగా వివరించారు. ఈ సంఘర్షణ మూడు వారాలకు పైగా కొనసాగుతోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.’’ అని అన్నారు.
‘‘భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడానికి అనేక చర్యలు తీసుకున్నాము. మేము 41 దేశాల నుంచి ఇంధన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాము. మధ్యప్రాచ్య సంక్షోభం తర్వాత మేము ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై దృష్టి సారించాము. అయితే హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరా గొలుసుకు అంతరాయం కలగడం దిగుమతులపై ప్రభావం చూపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. యుద్ధంలో పాల్గొంటున్న, యుద్ధ ప్రభావిత దేశాలతో భారతదేశానికి విస్తృత వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ యుద్ధం జరుగుతున్న ప్రాంతం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో మన వాణిజ్యానికి కూడా ఒక ముఖ్యమైన మార్గం. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ అవసరాల్లో అధిక భాగాన్ని తీరుస్తుంది.’’ అని మోడీ పేర్కొన్నారు.
