దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. తక్షణ సమస్యలు, ప్రస్తుత గణాంకాలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరాల్లో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఆలోచించాలని పిలుపునిచ్చారు. గురువారం 7 లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మోడీ మూడోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మౌలిక వసతులు, కనెక్టివిటీ, భద్రత, విదేశీ వ్యవహారాలు, పాలన తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
శాఖల మధ్య ‘సిలో’ విధానానికి స్వస్తి
ప్రభుత్వ శాఖలు విడివిడిగా పనిచేసే విధానాన్ని తొలగించాలని ప్రధాని మోడీ సూచించారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కేవలం వ్యవస్థాపరమైన సమస్య మాత్రమే కాదని, అధికారుల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘వోల్ ఆఫ్ గవర్నమెంట్’ విధానంతో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. కోవిడ్-19 మహమ్మారి, పశ్చిమ ఆసియా సంక్షోభం వంటి సందర్భాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసిన తీరును మోడీ ఉదాహరణగా ప్రస్తావించారు.
భవిష్యత్తుకు డేటా కీలకం
డేటాను దేశ భవిష్యత్తుకు సంబంధించిన జాతీయ ఆస్తిగా ప్రధాని మోడీ అభివర్ణించారు. డేటా సేకరణ, భద్రత, నిర్వహణ కోసం ప్రభుత్వం భారీగా వనరులను వినియోగిస్తున్నప్పటికీ, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో దాని పూర్తి ప్రయోజనం అందడం లేదని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల డేటా ప్లాట్ఫారమ్లు పరస్పరం సమర్థవంతంగా సమాచారాన్ని పంచుకునేలా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని సూచించారు. డేటా సమీకరణ ద్వారా విధాన రూపకల్పన మరింత మెరుగుపడి, ఇప్పటికే ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
AI వినియోగం పెంచాలి.. మానవ నిర్ణయాలకు ప్రాధాన్యం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపైనా సమావేశంలో చర్చ జరిగింది. పాలన, ప్రజా సేవల మెరుగుదలకు AIని మరింత వినూత్నంగా ఉపయోగించాలని మోడీ సూచించారు. అయితే కీలక నిర్ణయాల విషయంలో మానవ అనుభవం, విచక్షణ, నిర్ణయ సామర్థ్యం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. AIతో పాటు మానవ నైపుణ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించే విధానాలను అధికారులు అన్వేషించాలని కోరారు. విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు, యువతతో ప్రభుత్వ శాఖలు మరింతగా అనుసంధానం కావాలని కూడా ప్రధాని సూచించారు. యువత, విద్యార్థుల నుంచి వచ్చే కొత్త ఆలోచనలు సంప్రదాయ విధానాలను సవాలు చేస్తూ పాలనలో కొత్త మార్పులకు దోహదపడతాయని చెప్పారు.
రక్షణ పరిశ్రమ, సముద్ర రంగంపై ప్రత్యేక దృష్టి
భారత రక్షణ పరిశ్రమను మరింత బలోపేతం చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా చేయాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. రక్షణ రంగానికి సంబంధించిన ఆధునిక కోర్సులను రూపొందించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేయాలని సూచించారు. దేశ సముద్ర సామర్థ్యాలను పెంచేందుకు సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని కూడా మోడీ అన్నారు. నౌకా నిర్మాణ రంగానికి ఇప్పటికే మౌలిక వసతుల హోదా కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ రంగానికి నిర్దేశించిన లక్ష్యాల దిశగా ఆశించిన స్థాయిలో పురోగతి జరుగుతోందా లేదా అనే అంశాన్ని అధికారులు సమీక్షించాలని, అవసరమైన చర్యలను ‘మిషన్ మోడ్’లో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
అధికారుల్లో టీమ్ స్పిరిట్ పెరగాలి
ప్రభుత్వ అధికారుల మధ్య మరింత బలమైన టీమ్ స్పిరిట్ అవసరమని ప్రధాని మోడీ అన్నారు. సీనియర్ అధికారులు జూనియర్ అధికారులతో తరచుగా అనౌపచారికంగా మాట్లాడాలని సూచించారు. ఇలాంటి పరస్పర సంబంధాలు వివిధ శాఖలు, కేడర్ల మధ్య బలమైన వృత్తిపరమైన నెట్వర్క్లను ఏర్పాటు చేయడంలో సహాయపడతాయని చెప్పారు. తద్వారా ప్రభుత్వంలోని వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేసి సాధారణ లక్ష్యాలను వేగంగా సాధించగలవని తెలిపారు.
సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు తమ తమ శాఖలకు సంబంధించిన అనుభవాలు, ప్రాధాన్యతలు, ఎదురవుతున్న కొత్త సవాళ్లను ప్రధాని మోడీతో పంచుకున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, విధానాల అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. భారతదేశ భవిష్యత్తును నిర్మించేందుకు ఈరోజు తీసుకునే నిర్ణయాలు కీలకమని, అందుకే తక్షణ సమస్యలకు మించి దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని ప్రధాని మోడీ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.
Chaired a high-level meeting with Secretaries to the Government of India and discussed the future action agenda of Ministries and Departments pertaining to Infrastructure and Connectivity, Security and External Affairs and other aspects of Governance.
Emphasised the need for…
— Narendra Modi (@narendramodi) August 20, 2026

