PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!

  • కాంగ్రెస్‌ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోంది
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ కుటుంబ పార్టీలే
  • కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు : ప్రధాని మోడీ
Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్‌ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోందని, ఆ పార్టీ MMCగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. MMC అంటే ముస్లిం లీగ్‌ మావోవాది కాంగ్రెస్‌ పార్టీ అని మోడీ చెప్పారు. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అంటూ తెలుగులో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న బెంగాల్‌కు వెళ్లాను. బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సీఎం ప్రమాణస్వీకారం చేశారు. భారీ మెజార్టీతో బెంగాల్‌లో బీజేపీ గెలిచింది. బెంగాల్‌ విజయోత్సవం తెలంగాణలో కనిపిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, ఆ రాష్ట్రంలో ఎలాంటి ఉత్సాహాన్ని చూశామో, అచ్చం తెలంగాణలో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోందని చెప్పారు. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారని, దాంతో మమత నియంతృత్వం నుంచి బెంగాల్ విముక్తమైందని చెప్పారు. అస్సోంలో బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుందని, అలాగే పుదుచ్చేరిలో కూడా NDA రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.

ఇప్పుడు తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తోందని, రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కార్‌ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారు. కానీ ఈ సారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో బానిస సంకెళ్లు తొలిగాయి. టీఎంసీ తానాషాహీ మోడల్‌తో ప్రజలను ఇబ్బంది పెట్టింది. బెంగాల్‌ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు, అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రెండూ కుటుంబ పార్టీలే. దేశంలో 14 ఇండస్ట్రియల్‌ కారిడార్ల పనులు జరుగుతున్నాయి. అందులో ఒకటి జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ ఎక్కడున్నా ఒకటే మోడల్‌. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తారు. ఆ తర్వాత సాకులు వెతుకుతారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోందని విమర్శించారు.