PM Modi: కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు..

  • విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడిన ప్రధాని మోడీ..
  • కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు..
  • కాంగ్రెస్ పార్టీపై జాతీయ స్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు: ప్రధాని మోడీ
Modi

Modi

PM Modi: సూరత్‌లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందిస్తూ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వారిని, ముస్లిం లీగ్‌ -మావోయిస్టు భావజాలం కలిగిన వారిని ఇక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అలాగే, పదేళ్ల నుంచి వరుస ఓటములపై రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతేకాదు.. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీలతో పని చేసిన జాతీయ నాయకులు కూడా ఆ పార్టీ నేత చేసిన విన్యాసాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.

Read Also: CSK New Captain 2026: 2026 ఐపీఎల్‌కు కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సీఎస్‌కే యాజమాన్యం..

ఇక, మిత్రపక్షాలకు, కార్యకర్తలకు కూడా బీహార్ లో ఓటమి గురించి వివరించే పరిస్థితిలో ఆ పార్టీ నేతలు లేరని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్, ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై నిందలు వేసే సులభమైన మార్గాన్ని కనిపెట్టిందని అన్నారు. అలాగే, కులతత్వ విషాన్ని చిమ్మే వారిని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పడానికి బీహార్‌ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని వెల్లడించారు. దళితులు అత్యధికంగా ఉన్న 38 స్థానాల్లో 34 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది, దళితులు కూడా కాంగ్రెస్‌ను తిరస్కరించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌- ఆర్జేడీలతో కూడిన మహాఘఠ్‌బంధన్‌ కేవలం 34 సీట్లలో మాత్రమే గెలిచింది, అధికార ఎన్డీయే 202 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో రికార్డు సృష్టించింది అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.