PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..

  • ప్రధాని మోడీ కొత్త వీడియో
  • ‘తప్పులు చేసిన వారికి మారే అవకాశం ఇవ్వాలి’
  • ‘తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగాలి’
Pm Modi

Pm Modi

తనపై, తన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. “తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు” అని అన్నారు. తప్పుదారి పట్టిన వారిని శిక్షించడం కంటే వారికి సరైన మార్గం చూపడం, సమాజం వారిని అర్థం చేసుకోవడం అవసరమని సూచించారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన దాదాపు మూడు నిమిషాల వీడియోలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వద్ద NEET (UG) పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ జరిగిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)’ నిరసన సందర్భంగా తనపై అసభ్య పదజాలం ఉపయోగించిన ఘటన నేపథ్యంలో ఆయన స్పందించారు.

‘తప్పులు చేసిన వారికి మారే అవకాశం ఇవ్వాలి’

తనపై, తన తల్లిపై కూడా అనుచిత పదజాలం ఉపయోగించారని మోడీ చెప్పారు. అయితే, యువకులు కొన్నిసార్లు తప్పులు చేయడం సహజమేనని, వాటిని సరిదిద్దుకునే అవకాశం వారికి ఇవ్వాలని అన్నారు. “వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం, సమాజంలో వేధించడం వల్ల పరిస్థితి మారదు. నేను వారిని క్షమించాలని కోరుకుంటున్నాను. సమాజం కూడా వారిని అంగీకరించాలి” అని ప్రధాని పేర్కొన్నారు.

‘పళ్ళు, నాలుక’ ఉదాహరణతో మోడీ సందేశం

తన ప్రసంగంలో ప్రధాని మోడీ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను కూడా చెప్పారు. “కొన్నిసార్లు మన నాలుక పళ్ల మధ్య ఇరుక్కుని గాయమై రక్తం వచ్చినా, మనం పళ్లను విరగ్గొట్టము. ఎందుకంటే పళ్లు, నాలుక రెండూ మనవే. ఈ పిల్లలు కూడా మనవారే. వారికి సరైన మార్గం చూపించడం మన బాధ్యత” అని అన్నారు. దేశం కోసం సమాజం మొత్తం కలిసి ముందుకు రావాల్సిన సమయం ఇదేనని పేర్కొన్నారు.

‘తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగాలి’

దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మోడీ అన్నారు. యువత కూడా తమ జీవితాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. “దేశం ముందుకు వెళ్తోంది. మరింత అభివృద్ధి సాధించే దిశగా పయనిస్తోంది. మీరు కూడా జీవితంలో ముందుకు సాగాలని నా కల. నేను మీ కోసం జీవిస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తుకు నన్ను నేను అంకితం చేస్తున్నాను. రండి.. మనమంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగుదాం” అని ప్రధాని మోడీ అన్నారు.

వైరల్ వీడియోపై స్పందన

ప్రధాని మోడీ తాజా స్పందనకు కారణమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోకు సంబంధించినది. అందులో నోయిడాకు చెందిన ఓ మహిళ ప్రధానిపై అనుచిత పదజాలం ఉపయోగించినట్లు కనిపించింది. ఆ మహిళను నోయిడాలోని సెక్టార్ 168కు చెందిన రుచికా సింగ్ గా గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అనంతరం ఆమెపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు

ఈ ఘటనపై ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేసినట్లు నివేదికలు తెలిపాయి. ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను ఢిల్లీ పోలీసులు కూడా పరిశీలించనున్నట్లు సమాచారం.