కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని ప్రధాని మోడీ వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ మానస్ ప్రత్యేకత ఏంటి? మహాభారతానికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
కిర్గిజిస్థాన్ పర్యటనలో ప్రధాని మోడీకి ఆ దేశపు అద్భుతమైన సాంస్కృతిక సంప్రదాయం ప్రత్యక్షమైంది. బిష్కెక్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ మనస్చీ (Manaschi) రిస్బై ఇసాకోవ్.. దాదాపు 5 లక్షల పంక్తులతో కూడిన ‘మానస్’ (Manas) మహాకావ్యాన్ని తన శక్తివంతమైన స్వరంతో ఆలపించారు. శతాబ్దాలుగా మౌఖిక సంప్రదాయంగా కొనసాగుతున్న ఈ మహాకావ్యం కిర్గిజ్ ప్రజల చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది.
ఈ సందర్భంగా కిర్గిజ్ విద్యావేత్త గుల్జాత్ మాయాచినోవా మాట్లాడుతూ.. “మానస్, మహాభారతం రెండూ స్నేహం, సహనం వంటి ఉమ్మడి విలువలను పంచుకుంటాయి” అని పేర్కొన్నారు. భారత్, మధ్య ఆసియా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు ఈ కార్యక్రమం మరో ఉదాహరణగా నిలిచింది. భారత్లోని ‘మహాభారతం’తో పోల్చదగిన మౌఖిక ఇతిహాస సంప్రదాయం కిర్గిజిస్థాన్లోనూ ఉందనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.
కిర్గిజిస్థాన్ పవిత్ర ఇతిహాసం ‘మానస్’ అంటే ఏమిటి?
కిర్గిజ్ ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో ‘మానస్’కు అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. ఇది సాధారణంగా పుస్తక రూపంలో చదివే కావ్యం కాదు. తరతరాలుగా ఒకరి నుంచి మరొకరికి మౌఖికంగా అందుతూ వచ్చిన విస్తారమైన ఇతిహాసం. శతాబ్దాల కాలంలో దీనికి అనేక రూపాలు, వెర్షన్లు ఏర్పడ్డాయి. ‘మానస్’ ప్రపంచంలోని అతిపెద్ద ఇతిహాసాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ స్థానం సంపాదించింది. అలాగే మానవాళి మౌఖిక, అమూర్త సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా గుర్తింపు పొందింది. ఈ ఇతిహాసం ప్రధానంగా మానస్ అనే వీరుడి జీవితాన్ని వివరిస్తుంది. తన ప్రజలను, భూమిని రక్షిస్తూ గొప్ప యోధుడిగా, నాయకుడిగా ఎదిగిన మానస్.. పరస్పరం విభేదించే కిర్గిజ్ తెగలను ఉమ్మడి శత్రువులపై ఏకం చేస్తాడు. అయితే ‘మానస్’ కేవలం యుద్ధాలు, విజయాల కథ మాత్రమే కాదు. ఇందులో స్నేహాలు, పొత్తులు, విందులు, వివాహాలు, ద్రోహాలు, వలసలు, నాయకత్వం, విధేయత, గౌరవం వంటి ఎన్నో అంశాలు కనిపిస్తాయి. కిర్గిజ్ ప్రజల సంప్రదాయ జీవన విధానం, ఆచారాలు, నైతిక విలువలతో పాటు మతం, వైద్యం, భౌగోళిక పరిజ్ఞానం వంటి అంశాలూ ఇందులో చోటు చేసుకున్నాయి.
మానస్ కథ అక్కడితో ముగియదు..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మానస్ మరణంతో ఈ ఇతిహాసం ముగియదు. ఆయన తర్వాత కథ ఆయన కుమారుడు సెమెటెయ్, ఆ తర్వాత మనవడు సెయ్టెక్ చుట్టూ కొనసాగుతుంది. మానస్, సెమెటెయ్, సెయ్టెక్ కథలను కలిపి సాధారణంగా ‘మానస్-సెమెటెయ్-సెయ్టెక్ త్రయం’గా పేర్కొంటారు. దీంతో ఒక వీరుడి జీవితకథగా మొదలైన ఇతిహాసం.. తరతరాలుగా కొనసాగే భారీ గాథగా మారుతుంది.
‘మానస్’ ఇంతకాలం ఎలా సజీవంగా కొనసాగిందనేది కూడా ఆశ్చర్యకరమే. దీనిలో చాలా భాగం పుస్తకాల్లో కాకుండా సంప్రదాయ కథకులైన మనస్చీలు (Manaschi) జ్ఞాపకాల్లో, వారి ప్రదర్శనల్లో జీవిస్తోంది. మనస్చీలు మానస్ ఇతిహాసాన్ని విస్తృతంగా కంఠస్థం చేసుకుని ప్రేక్షకుల ముందు గంటల తరబడి, రోజుల తరబడి ప్రదర్శిస్తారు. పూర్తి ఇతిహాసాన్ని వినిపించడానికి దాదాపు మూడు రోజుల సమయం పట్టవచ్చని చెబుతారు. మనస్చీలకు అసాధారణ జ్ఞాపకశక్తి, కవితా ప్రతిభ, లయపై పట్టు ఉండటంతో పాటు కథలోని సన్నివేశాలను హావభావాలు, అనుకరణల ద్వారా ప్రేక్షకుల కళ్ల ముందు సజీవంగా ఆవిష్కరించే సామర్థ్యం ఉంటుందని కిర్గిజ్ సంప్రదాయం చెబుతోంది. వివిధ మనస్చీలు తమదైన శైలిలో కథను చెప్పడంతో.. ‘మానస్’ ఒకే రూపంలో ఉన్న నవలలా కాకుండా నిరంతరం పరిణామం చెందే జీవంతమైన సాహిత్య సంప్రదాయంగా మారింది.
మానస్లో ఆధ్యాత్మిక, మిస్టరీ అంశాలు కూడా..
ఈ మహాకావ్యంలో కేవలం మానవ జీవితానికి సంబంధించిన అంశాలే కాకుండా ఆధ్యాత్మిక, పౌరాణిక కోణాలు కూడా ఉన్నాయి. అతీంద్రియ ఘటనలు, మత విశ్వాసాలు, ప్రవచనాలు, కలలు, పురాతన మధ్య ఆసియా సంప్రదాయాలు ఇందులో కనిపిస్తాయి. అయితే మానస్కు ఉన్న అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత దాని సాంస్కృతిక విలువలోనే ఉంది. శతాబ్దాలుగా కిర్గిజ్ ప్రజల చరిత్ర, జ్ఞాపకాలు, సంప్రదాయాలు, సామూహిక గుర్తింపును భద్రపరిచిన ఒక సాంస్కృతిక భాండాగారంగా ఇది నిలిచింది.
మానస్-మహాభారతం మధ్య పోలికలు ఎందుకు?
కిర్గిజిస్థాన్ వెలుపల కూడా ‘మానస్’పై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా భారత్లో దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో.. భారతీయ ఇతిహాసం ‘మహాభారతం’తో పోలికలు తెరపైకి వస్తున్నాయి. భౌగోళికంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ‘మానస్’, ‘మహాభారతం’ వంటి ఇతిహాసాల్లో సామూహిక జ్ఞాపకం, నాయకత్వం, కుటుంబం, విధేయత, గౌరవం, ధర్మం వంటి విలువలకు ప్రాధాన్యత కనిపిస్తుంది. తరతరాలుగా కథలను మాట ద్వారా, జ్ఞాపకం ద్వారా, ప్రదర్శనల ద్వారా సజీవంగా ఉంచిన సంప్రదాయం కూడా రెండింటిలోనూ ఆసక్తికరమైన సారూప్యతను చూపిస్తుంది.
ప్రధాని మోడీ కిర్గిజిస్థాన్ పర్యటనలో ‘మానస్’ ప్రత్యక్ష ప్రదర్శనకు ప్రాధాన్యత లభించడం.. భారత్, కిర్గిజిస్థాన్ మధ్య పెరుగుతున్న సాంస్కృతిక అనుబంధానికి మరో ఉదాహరణగా నిలిచింది. భిన్న భౌగోళిక ప్రాంతాల్లో పుట్టిన ఇతిహాసాలు కూడా మానవ విలువల విషయంలో ఒకే రకమైన భావాలను ఎలా ప్రతిబింబిస్తాయో ‘మానస్’ మరోసారి ప్రపంచానికి గుర్తుచేస్తోంది.

