భారత్ అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. పారిస్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ కీలక ప్రసంగం చేశారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని (Indian Space Station) ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని.. అలాగే 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించిన భారత్
భారత అంతరిక్ష ప్రయాణంలో సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రస్తావించారు. చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. అలాగే ఆదిత్య-ఎల్1 మిషన్ ద్వారా సూర్యుడి రహస్యాలను తెలుసుకునే దిశగా కీలక పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఒక భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన విషయాన్ని కూడా మోడీ గుర్తుచేశారు. 2035లో భారత స్పేస్ స్టేషన్.. 2040లో చంద్రుడిపైకి భారతీయుడు
భవిష్యత్ అంతరిక్ష ప్రణాళికలను వెల్లడిస్తూ మోడీ కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రుడిపైకి పంపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ చేపడుతున్న ప్రతి కార్యక్రమం ద్వారా లభించే ప్రయోజనాలు కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా మానవాళి మొత్తానికి చేరాలని తమ మార్గదర్శక సూత్రం అని మోడీ పేర్కొన్నారు.
ప్రైవేట్ స్పేస్ రంగానికి ప్రోత్సాహం
ఇస్రోతో పాటు భారత్లోని ప్రైవేట్ అంతరిక్ష రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని తెలిపారు. ప్రైవేట్ సంస్థల వ్యాపార సామర్థ్యం, ఇస్రో శాస్త్రీయ నైపుణ్యంతో కలిసి భారత అంతరిక్ష రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పారు. భారత అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైన 1960ల నుంచే ఫ్రాన్స్ విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతోందని మోడీ తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల సహకారం భూ పరిశీలన నుంచి అత్యాధునిక సాంకేతికతల వరకు విస్తరించిందన్నారు. భారత్ అంతరిక్ష రంగంలో ప్రారంభించబోయే తదుపరి దశ ప్రయాణంలో ఫ్రాన్స్తో పాటు ప్రపంచ దేశాలు కూడా భాగస్వాములు కావాలని మోడీ ఆహ్వానించారు.
కలిసి రక్షిద్దాం
పారిస్లో జరుగుతున్న స్పేస్ సమ్మిట్ ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని మోడీ ఆకాంక్షించారు. అంతరిక్షాన్ని కలిసి అన్వేషించడం, కలిసి కొత్త ఆవిష్కరణలు చేయడం, భవిష్యత్ తరాల కోసం అంతరిక్షాన్ని కలిసి రక్షించడం లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, అంతరిక్ష సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, శాస్త్రవేత్తలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. సమాజ అభివృద్ధికి అంతరిక్ష కార్యకలాపాలను దీర్ఘకాలికంగా కీలకమైన శక్తిగా మార్చే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి.

