Alluri Sitarama Raju International Airport: ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈ రోజు విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు. రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కేవలం 31 నెలల రికార్డు సమయంలో పూర్తవడం విశేషం.
మొదటి దశలో 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి 60 లక్షల (6 మిలియన్లు) మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మించబడింది. భవిష్యత్ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ సామర్థ్యాన్ని ఏడాదికి 4 కోట్ల (40 మిలియన్లు) మంది ప్రయాణికులకు పెంచేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. విమానాశ్రయం మొత్తం మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు.
విమానాశ్రయం ప్రత్యేకతలు
ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో 3,800 మీటర్ల పొడవైన కోడ్-4ఈ రన్వే, అత్యాధునిక సమీకృత ప్రయాణికుల టెర్మినల్, కార్గో సదుపాయాలు, దేశీయ, అంతర్జాతీయ విమానాలను నిర్వహించే ఆధునిక ఎయిర్సైడ్ మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు.
ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్
ఉదయం సుమారు 11 గంటలకు ప్రధాని మోడీ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విమానాశ్రయాన్ని పరిశీలించారు. అనంతరం ఓపెన్టాప్ వాహనంలో బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ 13,500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థులు సంప్రదాయ ధిమ్సా నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు జరిగిన సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మధ్యాహ్నం 1:10 గంటలకు ఢిల్లీకి బయలుదేరారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయి
ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగాలకు ఇది ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ సామాజిక-ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు తీసుకురానుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పర్యాటక రంగానికి కొత్త ఊపు
భోగాపురం విమానాశ్రయం ద్వారా ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీ, అరకు లోయ, బొర్రా గుహలు, విశాఖపట్నం తీర ప్రాంతం వంటి ఉత్తరాంధ్ర పర్యాటక ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. “Wings to the Dreams of North Andhra” అనే నినాదంతో విమానాశ్రయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్రకు మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగానికి కూడా కీలక మైలురాయిగా నిలవనుంది.

