Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్‌ని గుర్తించినా నాసా శాటిలైట్.. ఫోటోలు చూడండి..

Vikrm Lander

Vikrm Lander

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అత్యంత కఠినమైన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్, రోవర్ ని దించిన తొలిదేశంగా చరిత్రకెక్కింది. మొత్తంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనాల తర్వాత నాలుగో దేశంగా రికార్డుకెక్కింది. ల్యాండర్ విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి తెచ్చాయి. 14 రోజుల ఈ అధ్యయనంలో చంద్రుడి దక్షిణ ధృవంలో ఆక్సిజన్, సల్ఫర్ వంటి మూలకాలు ఉన్నట్లుగా గుర్తించింది. చంద్రుడిపై ఉష్ణోగ్రతలు మార్పును విశ్లేషించింది. ఇదిలా ఉంటే చంద్రుడిపై 14 రోజుల పగలు ముగిసి మరో 14 రోజుల పాటు కఠిక అంధకారం అలుముకోనుంది. దీంతో ల్యాండర్, రోవర్లని ఇస్రో స్లీప్ మోడ్ లో ఉంచింది. 14 రోజుల తర్వాత మళ్లీ మేలుకుంటాయని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Read Also: India Changed to Bharat: ‘ఇండియా’ని భారత్‌గా మార్చితే తప్పులేదు.. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి..

ఇదిలా ఉంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన శాటిలైట్ చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ని గుర్తించింది. నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్ఓ) ల్యాండర్ ఫోటోలను తీసింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఈ శాటిలైట్ తన కెమెరాతో ల్యాండర్ ఛాయాచిత్రాలను బంధించింది. చంద్రుడిపై చంద్రయాన్-3 అడుగుపెట్టిన నాలుగు రోజుల తర్వాత అంటే ఆగస్టు 27న ఎల్ఆర్ఓ ఈ ఫోటోలను తీసింది. ఎక్స్(ట్విట్టర్) ద్వారా నాసా ఈ చిత్రాలను షేర్ చేసింది. విక్రమ్ ల్యాండర్ చుట్టూ తెల్లగా ఉన్న ప్రాంతం.. ల్యాండిగ్ సమయంలో ల్యాండర్ ఇంజన్లు మండటం ద్వారా అక్కడి దూళి చెలరేగడం వల్ల ఏర్పడింది.