నేటినుంచే పార్లమెంట్.. సమరానికి విపక్షం రెడీ

ఇవాళ్టి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం అవుతుంది.

రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన అరగంట తర్వాత లోక్‌సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బడ్జెట్ సెషన్ జరుగుతుంది. ఇదిలా వుంటే విపక్షాలు అస్త్ర శస్త్రాలతో సభా సమరానికి రెడీ అవుతున్నాయి. రైతు చట్టాలు, పెగాసిస్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి విపక్షాలు. ప్రతిరోజూ 5 గంటల పాటు లోక్ సభ సమావేశాలుంటాయి. రాజ్యసభలో జీరో అవర్ అరగంటకు కుదించారు.