Delimitation Bills: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డిలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అధికారికంగా వాయిదా వేయలేదు. దీని ఫలితంగా ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలను పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
బ్రిక్స్ సమావేశాల అనంతరం ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవరాత్రుల సమయంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిక్స్ సమావేశాల తర్వాత స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలా వద్దా. ? అనే దానిపై కేంద్రం తన నిర్ణయాన్ని వెలువరించవచ్చు.
ఇదిలా ఉంటే, వర్షకాల సమావేశాలు ముగిసి 29 రోజులు గడిచినా, సభను వాయిదా వేయకపోవడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. ప్రభుత్వం తన సొంత రికార్డును తానే బద్ధలు కొడుతుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాన్ని భయపెట్టాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, కాని అది జరగలేదని అన్నారు.
ఈ వర్షాకాల సమావేశాల్లో్ గందరగోళం నెలకొంది. రోజుకు ఆరు గంటల చొప్పున సమావేశాలు జరుగుతాయని భావిస్తే, 15 రోజుల్లో 90 గంటలు పనిచేయాల్సి వస్తుంది. అయితే, ఈ సమావేశాల్లో లోక్సభ కేవలం 15 గంటల 36 నిమిషాలు, రాజ్యసభ 15 రోజుల్లో 24 గంటల 21 నిమిషాలు మాత్రమే జరిగింది. జంతర్ మంతర్ నిరసనలు, విద్యార్థుల సమస్యలు, విద్యార్థులపై పోలీసులు బలప్రయోగంపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు సభలో నిరసన తెలియజేశాయి.

