Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో ‘మంచమే’ అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!

Kalahandi Pregnant Woman Is

Kalahandi Pregnant Woman Is

Kalahandi Issues: యావత్ దేశం డిజిటల్ యుగంలో దూసుకుపోతున్నా, మారుమూల పల్లెల్లో కనీస రహదారి సౌకర్యం లేక సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఘటనలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన చూస్తుంటే.. ప్రభుత్వాలు మారుతున్నా, పేదల తలరాతలు మాత్రం మారడం లేదని అర్థమవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బురదలో ప్రసవ వేదన.. అంబులెన్స్ రాలేని దుస్థితి
ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని మల్పడా గ్రామానికి చెందిన దేవానంద్ మాఝీ భార్య లలిత గురువారం ఉదయం ప్రసవ వేదనతో విలవిలలాడింది. గ్రామాన్ని ప్రధాన రహదారితో కలిపే మట్టి రోడ్డు భారీ వర్షాలకు బురదమయంగా మారింది. వెంటనే కుటుంబ సభ్యులు ‘102 జనని అంబులెన్స్‌’కు సమాచారం అందించారు. సకాలంలో అంబులెన్స్ అయితే వచ్చింది కానీ, గ్రామంలోకి వచ్చే మార్గం లేకపోవడంతో కిలోమీటరు దూరంలోని అంబాగూడ ప్రధాన రహదారిపైనే నిలిచిపోయింది. బురదలో అంబులెన్స్ దిగబడిపోయే ప్రమాదం ఉండటంతో డ్రైవర్ బండిని ముందుకు రాలేని పరిస్థితి.

మంచమే అంబులెన్స్..
లలిత పరిస్థితి విషమించడంతో గ్రామస్థులు చొరవ చూపి.. ఇంట్లోని ఒక చెక్క మంచంపై ఆమెను పడుకోబెట్టి.. జారుడుగా ఉన్న బురద రోడ్డులో నలుగురు యువకులు భుజాల మీద మోసుకెళ్లారు. ఆశా కార్యకర్త తోడుగా రాగా, భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కిలోమీటరు దూరం మోసుకెళ్లి అంబులెన్స్ వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మల్పడా గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “గత ఏడాది కూడా ఇదే విధంగా ఒక రోగిని మంచంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు ఓట్ల కోసం హామీలు ఇస్తారు కానీ, వాటిని కనీసం అమలు చేయడం చేయడం లేదు. ఓట్లు అయిపోయిన తర్వాత కనీసం పట్టించుకోవడం లేదు” అని వాపోతున్నారు. అంబులెన్సులు ఉన్నాయి కానీ అవి రావడానికి రోడ్లు లేవు, పథకాలు ఉన్నాయి కానీ అవి పేదవాడి గడప వరకు చేరడం లేదు. కలహండిలో జరిగిన ఈ సంఘటన ఆధునిక భారతదేశంలోని గ్రామీణ వెనుకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస రహదారి సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.