NTV Telugu Site icon

Rahul Gandhi: “రాజ్యాంగానికి అతీతుడివి కాదు”.. రాహుల్ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అశ్విణి వైష్ణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రిసైడింగ్ అధికారిపై ప్రశ్నలు సంధించడంపై పార్లమెంట్‌లో పాల్గొనే సమయం రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించే ఉద్దేశ్యం ఆయనకు లేదని అన్నారు. సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారాన్ని ప్రశ్నించడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..

స్పీకర్‌పై ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు సభా నియమాలను, విధానాలను పట్టించుకోకుండా మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రవర్తనకు ఒక చరిత్ర ఉందని మరో మంత్రి అశ్విణి వైష్ణవ్ అన్నారు. ఒకప్పుడు రాహుల్ గాంధీ సొంత పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ని చింపేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనకు రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించే ఉద్దేశ్యం లేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ సభలో ఆయన ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

ప్రతిపక్ష నేత పదవి పెద్ద బాధ్యత అని, అయితే స్పీకర్‌ని ఉద్దేశించి గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని రిజిజు అన్నారు. సభ నిబంధనల ప్రకారం నడుస్తుందని, స్పీకర్ సభకు సంరక్షకుడని, ఈరోజు రాహుల్ గాంధీ స్పీకర్‌పై దాడి చేయడం ప్రారంభించారని, చర్చలో ఉన్న కేంద్ర బడ్జెట్ తప్పా మిగతా వాటి గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నిబంధనలకు లోబడి మాట్లాడాలని కాంగ్రెస్ నాయకుడికి పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా లేనప్పుడు వేరే విషయం కానీ, ఇప్పుడు ఆ హోదాలో ఉండీ అతను నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఉంటుందని, రాజ్యాంగానికి ఎవరూ అతీతుల కాదని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు.