Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు..
  • విద్యావంతులు ఉండే ఏరియాల్లో తక్కువ ఓట్లే వచ్చాయి.
  • అండర్‌వరల్డ్, రెడ్ లైట్ ఏరియాల నుంచే ఎక్కువ ఓట్లు.
  • నాగ్‌పూర్ ఓటింగ్ సరళిపై గడ్కరీ కామెంట్స్..
Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari:  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం నాగ్‌పూర్‌లో ఓటింగ్ సరళిపై మాట్లాడుతూ.. నగరంలో అత్యధిక విద్యావంతులు ఉండే ప్రాంతాల కన్నా నేరస్తులు, అండర్‌వరల్డ్‌తో సంబంధం ఉన్న ప్రాంతాలు, రెడ్‌లైట్ ఏరియాల నుంచే తనకు ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వవర్గాలకు చెందిన వ్యక్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

విద్యావంతులు ఉంగే కొన్ని ప్రాంతాల్లో తనకు 70-75 శాతం ఓట్లు వచ్చాయని, అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ప్రాంతాలలో సంబంధం ఉన్న ఏరియాల నుంచి 92 శాతం ఓట్లు లభించాయని అన్నారు. ఆ ప్రాంతాల్లో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే అక్కడి ప్రజల మద్దతుకు కారణమని గడ్కరీ వివరించారు. రోడ్ల నిర్మాణం, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ప్రాంతాల్లో పనిచేశానని అన్నారు.

అంతకుముందు ఆగస్టు 25న నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో మాదిరిగా ఎక్కువ పనిచేయలేనని, బాధ్యతలను కొత్త తరానికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు రాజకీయ ఉద్దేశం లేదని తర్వాత ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. 30 ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని ఆ సమయంలో గడ్కరీ పేర్కొన్నారు. యువ నాయకులకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.