Nirav Modi: భారతదేశం నుంచి పారిపోయిన ప్రముఖ డైమండ్ వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీకి యూకే కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దుబాయ్ ఆధారిత రుణ వివాదానికి సంబంధించిన ఒక కేసులో.. ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (Bank of India)కు వడ్డీతో కలిపి మొత్తం 10.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.100 కోట్లకు పైగా) చెల్లించాల్సిందేనని లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
పర్సనల్ గ్యారెంటీనే కొంపముంచింది..
రూ.13,000 కోట్ల పీఎన్బీ స్కామ్లో ఇరుక్కున్న నీరవ్ మోడీకి చెందిన ఫైర్స్టార్ గ్రూప్.. దుబాయ్లో ‘ఫైర్స్టార్ డైమండ్ ఎఫ్జెడ్ఈ’ (Firestar Diamond FZE) అనే అనుబంధ సంస్థను నడిపింది. ఈ కంపెనీ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న రుణానికి గానూ 2012 ఆగస్టు 3న నీరవ్ మోడీ వ్యక్తిగత హామీ పత్రంపై సంతకం చేశారు. కంపెనీ ఒకవేళ రుణం కట్టలేకపోతే.. తానే స్వయంగా బాధ్యత వహిస్తానని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు సదరు దుబాయ్ కంపెనీ డిఫాల్ట్ అవ్వడంతో, ఆ బాధ్యత నీరవ్ మోడీ నెత్తిన పడింది. అసలు బకాయి 4.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.38.9 కోట్లు) కాగా, దానికి వడ్డీ కూడా తోడవ్వడంతో మొత్తం చెల్లింపు రూ.100 కోట్లు దాటింది.
సీబీఐ ఎంట్రీతో మారిన సీన్
ఈ రుణాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా 2012లోనే మంజూరు చేసింది. అంటే పీఎన్బీ మోసం వెలుగులోకి రాకముందే ఈ లావాదేవీ జరిగింది. అయితే 2018 ఫిబ్రవరిలో నీరవ్ మోడీ చేసిన దాదాపు 2 బిలియన్ డాలర్ల బ్యాంకింగ్ మోసంపై సీబీఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఫైర్స్టార్ గ్రూప్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మీడియాలో వచ్చిన వార్తల వల్ల తమ వ్యాపారం దెబ్బతిందని, తాము అప్పులు తీర్చే స్థితిలో లేమని స్వయంగా నీరవ్ మోడీ బ్యాంకుకు ఈ-మెయిల్ ద్వారా అంగీకరించారు. దీంతో అలర్ట్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆయనపై రికవరీ చర్యలు ప్రారంభించి డిమాండ్ నోటీసులు జారీ చేసింది.
లండన్ కోర్టులో వీగిన వాదనలు
బ్యాంకు జారీ చేసిన రికవరీ నోటీసులను నీరవ్ మోడీ లండన్ కోర్టులో సవాలు చేశారు. 2018 ఏప్రిల్, అలాగే 2025 అక్టోబర్లో జారీ చేసిన డిమాండ్ నోటీసులు తనకు అందలేదని, ఆ సమయంలో ఆయన ఇండియా వెలుపల ఉన్నారని నీరవ్ న్యాయవాదులు వాదించారు. అయితే కోర్టు ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. ప్రస్తుతం నీరవ్ మోడీ బ్రిటన్ జైలులో ఉన్నారని, అక్టోబర్ 2025 నాటి నోటీసును నేరుగా జైలుకే పంపామని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు 2018 నాటి నోటీసు కాపీని 2019లోనే మోడీ న్యాయప్రతినిధులు అందుకున్నారని, కాబట్టి బ్యాంకు డబ్బులు అడుగుతున్న విషయం వారికి ముందే తెలుసని కోర్టు తేల్చి చెప్పింది. చివరికి ఈ రుణాన్ని తక్షణమే రికవరీ చేయడానికి, వ్యక్తిగత హామీని అమలు చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పూర్తి చట్టపరమైన హక్కులు ఉన్నాయని స్పష్టం చేస్తూ లండన్ కోర్టు బ్యాంకుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పటికే లండన్ జైలులో ఊచలు లెక్కపెడుతున్న నీరవ్ మోడీకి ఈ తీర్పు కోలుకోలేని దెబ్బగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

