నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం NEET UG 2026 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్, AYUSH, అనుబంధ ఆరోగ్య కోర్సుల అడ్మిషన్లు, కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఈ ఏడాది జూన్ 21న నిర్వహించిన NEET UG పరీక్షకు దేశవ్యాప్తంగా, విదేశాల్లో కలిపి సుమారు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత (క్వాలిఫై) సాధించారు.
NEET UG 2026 పరీక్ష వివరాలు
NEET UG 2026 పరీక్షను భారతదేశంలోని 551 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు MBBS, BDS, AYUSH, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ హెల్త్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులు.
NEET UG 2026 స్కోర్కార్డ్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
అభ్యర్థులు తమ స్కోర్కార్డ్ను అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ విధానం:
అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ను సందర్శించండి.
హోమ్పేజీలో కనిపించే NEET UG 2026 Scorecard లింక్పై క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, అవసరమైన వివరాలను నమోదు చేయండి.
మీ స్కోర్కార్డ్ స్క్రీన్పై కనిపిస్తుంది.
PDF రూపంలో డౌన్లోడ్ చేసి భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
అర్హత సాధించిన వారిలో బాలికలే అధికం
NTA విడుదల చేసిన వివరాల ప్రకారం, అర్హత సాధించిన అభ్యర్థుల్లో 58 శాతానికి పైగా బాలికలే ఉన్నారు. ఈ పరీక్షను 13 భాషల్లో నిర్వహించగా, దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు విదేశాల నుంచి కూడా విద్యార్థులు పాల్గొన్నారు. అత్యధికంగా విజయం సాధించిన అభ్యర్థుల వయస్సు 17 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉందని NTA వెల్లడించింది.
ముఖ్య వివరాలు
మొత్తం 138 మంది విద్యార్థులు 720 మార్కులకు గాను 690కు పైగా మార్కులు సాధించారు.
వీరిలో 93 శాతానికి పైగా మొదటిసారి NEET రాసిన అభ్యర్థులే.
దాదాపు 99 శాతం మంది 17-19 ఏళ్ల వయస్సు కలిగినవారే.
రాష్ట్రాల వారీగా విశేషాలు
ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 1.7 లక్షలకు పైగా అభ్యర్థులు అర్హత సాధించారు.
లక్షద్వీప్ నుంచి 43 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
ప్రతి ఈశాన్య రాష్ట్రం నుంచి కూడా రాష్ట్ర టాపర్లు నమోదయ్యారని NTA తెలిపింది.
మొత్తం 17 మంది రాష్ట్ర టాపర్లు 700 మార్కులకు పైగా, మరో 26 మంది 690 మార్కులకు పైగా స్కోర్ చేశారు.
కొన్ని రాష్ట్రాల టాపర్లు
లడఖ్: జిగ్మెట్ యాంగ్చెన్ లామో – 530 మార్కులు
అండమాన్ & నికోబార్ దీవులు: ధ్రువ్ త్రిపాఠి – 606 మార్కులు
లక్షద్వీప్: ఫహ్మిదా అనీస్ – 573 మార్కులు
దేశవ్యాప్తంగా 66 నగరాల నుంచి టాప్ ర్యాంకర్లు
690కు పైగా మార్కులు సాధించిన 138 మంది విద్యార్థులు దేశంలోని 66 నగరాలకు చెందినవారు. అలాగే 705కు పైగా మార్కులు సాధించిన టాప్ 17 మంది అభ్యర్థులు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారని NTA వెల్లడించింది.
టాపర్లలో తెలంగాణకు చెందిన విద్యార్థులు
హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు 705 మార్కులతో ఆలిండియాలో 13వ ర్యాంకు, బూర సాయిచరణ్ 19వ ర్యాంకు, కందగట్ల అనిష్ 21, అందెం సాయిచరణ్రెడ్డి 38, మయూక్ జయసింహ 42, కొంపెల్ల సాయిగాయత్రి 83, రుతుంబిక మొహంతి 91వ ర్యాంకు సాధించారు. దేవిష్ శ్రీగోపాల్ అగర్వాల్ 123వ ర్యాంకు పొందారు.
ఆంధ్రప్రదేశ్
నామాల ప్రేరణ 36వ ర్యాంకు సాధించారు. గ్రంధి హనీష్ 74, రేలంగి జయషణ్ముఖి 86, కొండ్రెడ్డి హారిక దేవిశ్రీ అనూహ్య 103, వంగా శ్రీనివాసరెడ్డి 125, వడ్డేపల్లి దుష్యంత్ 126వ ర్యాంకులతో ర్యాంకులు కొల్లగొట్టారు.
కౌన్సెలింగ్ త్వరలో
ఫలితాలను సమయానికి విడుదల చేయడంతో మెడికల్ కాలేజీల అడ్మిషన్లు, కౌన్సెలింగ్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ప్రారంభమవుతుందని NTA తెలిపింది. అర్హత సాధించిన విద్యార్థులు అధికారిక ప్రకటనలను గమనిస్తూ తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

