8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం పద్ధతి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక సంస్థను అవమానిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. గురువారం విచారిస్తామని స్పష్టం చేసింది.
ఇంతలోనే పాఠ్యాంశంపై NCERT విచారం వ్యక్తం చేసింది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ అధ్యాయంపై చింతిస్తున్నట్లు పేర్కొంది. అనుచిత అంశాలను చేర్చడం వెనుక ఎలాంటి దురద్దేశం లేదని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తెలిపింది. ముద్రించిన పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ముద్రించిన 2.25 లక్షల కాపీలను గిడ్డంగికి తిరిగి పంపించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
రాజ్యాంగ అక్షరాస్యత, సంస్థాగత గౌరవం, విద్యార్థుల్లో ప్రజాస్వామ్య భాగస్వామ్యంపై అవగాహన పెంచడమే కొత్త పాఠ్యపుస్తకాల లక్ష్యం అని తెలిపింది. అంతే తప్ప ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ‘‘ఏ రాజ్యాంగ సంస్థ అధికారాన్ని ప్రశ్నించే లేదా తగ్గించే ఉద్దేశ్యం లేదు.’’ అని చెప్పింది.
అసలేం జరిగిందంటే..
NCERT 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే కంటెంట్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దృష్టికి సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తీసుకొచ్చారు. పాఠశాల విద్యార్థులకు ఇలాంటి పాఠాలు నేర్పించడం ద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని.. ఇది చాలా విచారకరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠ్యాంశం తీరుపై న్యాయవాదులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.
ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని తాను గమనించానని చెప్పారు. సంస్థను కించపరుస్తామంటే ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇప్పటికే ఈ అంశంపై అనేక ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయని గుర్తుచేశారు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసు అన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదేదో ప్రణాళికబద్ధంగా.. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకంటే తాను ఏమీ చెప్పదలచుకోలేదన్నారు. ఏదేమైనా ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తదుపరి చర్యలకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం సూచించింది.
NCERT is trying to retrieve the 38 copies of the now-withdrawn Class 8 Social Science Part 2 textbook that were sold. Of the 2.25 lakh copies printed, 2,24,962 remained in inventory and have been recalled to the warehouse: Education Ministry Sources pic.twitter.com/nKQ8cecywW
— ANI (@ANI) February 26, 2026
