NALSAR Row: దేశవ్యాప్తంగా నల్సార్ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. న్యాయ విద్యార్థుల కాన్వొకేషన్కు సీజేఐ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై వివాదం మొదలైంది. కొందరు విద్యార్థులు దీనిపై అభ్యంతరం తెలిపారు. 2026లో న్యాయ విద్య పూర్తి చేసిన విద్యార్థులను అడ్వొకేట్లుగా ఎన్రోల్ చేయడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తాత్కాలికంగా ఆదేశించింది. ఆ తర్వాత విమర్శలు రావడంతో దీనిని విరమించుకుంది.
చివరకు ఈ విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ కూడా బీసీఐ తీరును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. ఈ వివాదానికి సంబంధించి తాను చేసిన ప్రకటనలు లేదా జారీ చేసిన ఏవైనా లేఖల ద్వారా న్యాయ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసినందుకు మిశ్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రస్తుత వివాదానికి సంబంధించి, తన మాటల ద్వారా గానీ, లేఖల ద్వారా గానీ న్యాయ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే, అందుకు తాను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెబుతున్నానని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
విచారం వ్యక్తం చేయడం లేదా క్షమాపణ చెప్పడం అనేది ప్రతిష్టకు లేదా అహంకారానికి సంబంధించిన విషయం కాదని ఆయన పేర్కొన్నారు. మన విద్యార్థుల భావాలు, ఆందోళనలు మనకు అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. ఈ క్షమాపణతో, విద్యార్థులతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను ముగించాలని ఆయన ఆశిస్తున్నారు.
నల్సార్ 2026 బ్యాచ్కు చెందిన 450 మందికి పైగా విద్యార్థులు యూనివర్సిటీ వైస్ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, ఇతర అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. 2026 కాన్వొకేషన్కు CJI జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు కోరారు. యువతను బొద్దింకలుగా పోల్చడాన్ని, జంతర్ మంతర్ నిరసలన సమయంలో పోలీసులు చర్యలు చూసేందుకు సమయం లేదని చెప్పడంపై సీజేఐ తీరును తప్పుబడుతున్నారు.

