స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే వారు ఎక్కడ దాక్కున్నా పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని తీవ్ర హెచ్చరిక చేశారు. ఉగ్రవాద నెట్వర్క్లపై భారత్ కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము.. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్యలు దేశ సాయుధ బలగాల సంసిద్ధత, సామర్థ్యాన్ని చాటిచెప్పాయని అన్నారు.
ఆపరేషన్ సింధూర్పై ప్రశంసలు
2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి అనంతరం భారత్ మే నెలలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక వసతులపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్రవాద స్థావరాలను కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నామని భారత్ అప్పట్లో ప్రకటించింది. ఈ ఆపరేషన్ భారత సాయుధ బలగాలు ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ఎంతటి సంసిద్ధతతో ఉన్నాయో నిరూపించిందని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటం కేవలం భౌగోళిక సరిహద్దులకు పరిమితం కాదని ఆమె స్పష్టం చేశారు.
భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. పహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ దేశ భద్రతా చర్చల్లో కీలక అంశంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రపతి ముర్ము తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

