Schools and Colleges Closed: భారీ వర్షాలు మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పన్వేల్, ఉరాన్, పాల్ఘర్, రాయగడ్ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ఈ రోజు (గురువారం) సెలవు ప్రకటించారు. నీటిమునిగిన ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తరగతులను పునఃప్రారంభించనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC), నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (NMMC), కళ్యాణ్-డొంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్ (KDMC), థానే మున్సిపల్ కార్పొరేషన్ (TMC) పరిధిలోని పాఠశాలలకు మాత్రం ఇప్పటివరకు సెలవు ప్రకటించలేదు. అక్కడ విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ముంబైలోని వర్లీ, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, జోగేశ్వరి, ముంబ్రా, నవీ ముంబై తదితర ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది. అలాగే హార్బర్ లైన్లో ఓవర్హెడ్ వైర్ తెగిపోవడంతో ముంబై లోకల్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
వర్షాల ప్రభావంతో మూడు విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చినప్పటికీ, అనంతరం అవి తిరిగి ముంబైకి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు భారత వాతావరణ శాఖ (IMD) వచ్చే 24 గంటల్లో ముంబై, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరించింది.
బీఎంసీ మాన్సూన్ నివేదిక ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముంబై నగరంలో సగటున 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు శివారు ప్రాంతాల్లో 99 మి.మీ., పశ్చిమ శివారు ప్రాంతాల్లో 90 మి.మీ. వర్షపాతం నమోదైంది. టాగోర్ నగర్ మున్సిపల్ స్కూల్, విక్రోలీలో అత్యధికంగా 146.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంధేరి, సాంటాక్రూజ్, ఖార్, బాంద్రా, కుర్లా, విక్రోలీ, పవాయ్, ఘాట్కోపర్, భాండుప్, ములుండ్ తదితర ప్రాంతాల్లో నీటిమునిగిన పరిస్థితులపై ఫిర్యాదులు అందాయని బీఎంసీ వెల్లడించింది. అయినప్పటికీ ప్రజా రవాణా సేవలు కొనసాగుతున్నప్పటికీ, పలు చోట్ల ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

