Lok Sabha elections: కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి మద్దతుగా “ముంబై పేలుళ్ల” నిందితుడు ఇబ్రహీం మూసా ప్రచారం.. ఎవరు ఇతను..?

1993 Bombay Blast

1993 Bombay Blast

Lok Sabha elections: 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇబ్రహీం ముసా కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’ కూటమి అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదమైంది. నార్ వెస్ట్ ముంబై ఎంపీ స్థానం నుంచి ఎంవీఏ కూటమి అభ్యర్థిగా శివసేన(ఉద్ధవ్) పార్టీకి చెందిన అమోల్ కీర్తీకర్ తరపున ఇజ్రహీం ముసా ప్రచారం చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ షేర్ చేసింది. అమోల్ కీర్తికర్ బుధవారం చేసిన ర్యాలీలో ముసా కనిపించాడని బీజేపీ పేర్కొంది.

ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే అమిత్ సతమ్, అమోల్ కీర్తికర్‌పై విరుచుకుపడ్డారు. ‘‘నిన్న సాయంత్రం అంధేరీ వెస్ట్‌లో, 1993 బాంబు పేలుళ్ల కేసు నిందితుడు బాబా మూసా ఫీల్డ్‌లో ముంబై నార్త్ వెస్ట్ MVA అభ్యర్థి అమోల్ కీర్తికర్‌కు ప్రచారం చేస్తూ మరియు మద్దతు ఇస్తూ కనిపించాడు. ఇది జాతీయవాద శక్తులు మరియు తుక్డే తుక్డే గ్యాంగ్ మధ్య పోరు మాత్రమే ఇప్పుడు స్పష్టమైందని, ఇది భారత్-పాకిస్తాన్ మధ్య పోరుగా అందరూ గుర్తించాలి’’ అని ఆయన అన్నారు. ఈ వీడియో బయటకు రావడంతో ఎంవీఏలోని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 1993 పేలుళ్లలో ముంబైని రక్షించేందుకు అనేక హిందువులు తమ ప్రాణాలను అర్పించారు. కాంగ్రెస్ ఉగ్రవాదులకు మద్దతుగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Padma Rao Goud: ఎంపీగా గెలిపిస్తే సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభివృద్ధికై కొట్లాడుతా..

ఇబ్రహీం ముసా ఎవరు..?

బాబా చౌహాన్ అని కూడా పిలువబడే మూసా 1993 బాంబే పేలుళ్ల కేసులో దోషి. ముంబై వరస బాంబు పేలుళ్ల కేసులో పేలుళ్లకు ముందు నటుడు సంజయ్ దత్ ఇంటికి ఆయుధాలు తీసుకెళ్లినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం, మూసా గ్యాంగ్‌స్టర్ అబూ సలేం, ఇతరులు జనవరి 15, 1993న ఆయుధాలను మరుసటి రోజు డెలివరీ చేస్తామని అతడికి తెలియజేయడానికి సంజయ్ దత్ ఇంటికి వెళ్లారు. ఈ పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మందికి పైగా గాయపడ్డారు.

రాజకీయ వివాదం:

ముంబై నార్త్ వెస్ట్ సీటులో ప్రధానం శివసేన(ఏక్‌నాథ్ షిండే), శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) పోటీ పడుతున్నాయి. బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి అయిన ‘మహాయుతి’ నుంచి రవీంద్ర వైకర్ పోటీలో ఉన్నారు. మరోవైపు ఎంవీఏ నుంచి అమోల్ కీర్తికర్ పోటీ చేస్తున్నారు. తాజాగా ఇజ్రహీం ముసా వీడియో వెలుగులోకి రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గానికి మే 20న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.