Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం

  • హిందూ మహాసముద్రంలో భారీ మేఘం
  • దేశంలో మరోసారి రుతుపవనాలు
  • భారీ వర్షాలు కురిసే అవకాశం
Monsoon

Monsoon

హిందూ మహాసముద్రంలో భారీ మేఘ సమూహం ఏర్పడింది. సముద్రంపై పెద్ద ఎత్తున మేఘాలు ఆవరించడంతో దేశంలో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా INSAT-3DS ఉపగ్రహం తీసిన థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ చిత్రాల్లో భూమధ్యరేఖకు సమీపంలోని మధ్య హిందూ మహాసముద్రం వరకు విస్తరించిన భారీ మేఘ సమూహం కనిపించింది. ప్రకాశవంతమైన తెల్లని మేఘాలు అత్యంత చల్లటి మేఘ శిఖరాలను సూచిస్తున్నాయి. ఇవి సుమారు 15-16 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సముద్రంపై బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా ఇంత విస్తృత స్థాయిలో వర్షాభావ మేఘాలు ఏర్పడటం నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయనే సంకేతంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఈ మేఘ సమూహం భారత ద్వీపకల్పానికి దక్షిణంగా ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. మరోవైపు భారత్‌లోని చాలా ప్రాంతాలకు వర్షాలను అందించే ప్రధాన ప్రాంతమైన బంగాళాఖాతంలో కొత్తగా బలమైన అల్పపీడన ప్రాంతం ఏర్పడే సంకేతాలు కనిపించడం లేదు.

ప్రస్తుతం మధ్య, తూర్పు, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రుతుపవన ద్రోణిలోని ఆవర్తనాలు, చురుగ్గా ఉన్న వర్షాభివృద్ధి కారణంగా ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉపగ్రహ చిత్రాల్లో మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల మీదుగా ఉరుములతో కూడిన భారీ మేఘ సమూహాలు విస్తరించి కనిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.

అయితే రుతుపవనాలు పూర్తిస్థాయిలో చురుగ్గా మారే సమయంలో కనిపించే పరిస్థితులకు భిన్నంగా.. ప్రస్తుతం బంగాళాఖాతంలో స్పష్టమైన తుఫాను తరహా ఆవర్తనం లేదా అల్పపీడన వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ ఏర్పడితేనే దేశంలోని విస్తృత ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితిని నిపుణులు ‘లోడెడ్ అట్మాస్ఫియర్’గా అభివర్ణిస్తున్నారు. అంటే వాతావరణంలో తేమ సమృద్ధిగా ఉన్నప్పటికీ.. దానిని ఒక బలమైన రుతుపవన అల్పపీడనంగా మార్చేందుకు అవసరమైన వాతావరణ ప్రేరణ ప్రస్తుతం అందుబాటులో లేదని అర్థం. అయితే హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ భారీ మేఘ సమూహం సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. ఇది భూమధ్యరేఖ దాటి ఉత్తర దిశగా తేమను తీసుకువచ్చే ప్రక్రియ బలంగా ఉందని సూచిస్తోంది. ఈ మేఘ సమూహం రానున్న రోజుల్లో క్రమంగా ఉత్తర దిశగా కదిలితే.. బంగాళాఖాతంలోకి తేమ ప్రవాహం పెరిగి కొత్త అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశాలు మెరుగుపడవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న సూపర్ టైఫూన్ డాల్ఫిన్ పరిణామాలను కూడా వాతావరణ నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. బలమైన టైఫూన్లు వాతావరణంలోని భారీ స్థాయి గాలుల ప్రసరణను తాత్కాలికంగా మార్చగలవు. ఫలితంగా బంగాళాఖాతంలో మేఘాభివృద్ధి తగ్గిపోయి.. రుతుపవన అల్పపీడన వ్యవస్థల ఏర్పాటులో జాప్యం కలగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య, తూర్పు భారతదేశంలో రుతుపవన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అయితే బంగాళాఖాతంలో స్పష్టమైన అల్పపీడన వ్యవస్థ ఏర్పడకపోవడంతో దేశవ్యాప్తంగా విస్తృతంగా, తీవ్రస్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

రానున్న కొద్ది రోజుల్లో బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థల పరిణామమే కీలకం కానుంది. ఒకవేళ అక్కడ అల్పపీడనం ఏర్పడితే.. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో సమృద్ధిగా ఉన్న తేమ మరోసారి నైరుతి రుతుపవనాలను చురుగ్గా మార్చి దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉంది.