Jantar Mantar Protest: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన నిర్వహించారు. ఈ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోడీని అత్యంత దారుణంగా తిట్టిన మైనర్ బాలికపై కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలికపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారు స్మృతి సింగ్ తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ వీడియోలో పిల్లల్ని క్షమిస్తున్నట్లు ప్రకటించడం, మైనర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఈ పరిణామాలకు ముందు ఘజియాబాద్ నివాసి స్మృతి సింగ్, నోయిడా ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో ఒక మైనర్పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగినందున, దీనిని జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. నిరసన ప్రదర్శన సమయంలో ప్రధానితో పాటు ఆయన తల్లిపై అభ్యంతరకరమైన మాటలు వాడారని స్మృతి సింగ్ చెప్పారు. దీంతోనే తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రధాని పిల్లల్ని క్షమించడంతో, మైనర్తో పాటు ఆమె తల్లి పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో తాను కంప్లైంట్ వాపస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న మైనర్ బాలిక జూలై 23న, ప్రధానిని ఉద్దేశిస్తూ చట్టానికి, సామాజిక మర్యాదకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత తన తప్పును గ్రహించి కన్నీటితో క్షమాపణలు చెప్పింది. ప్రధాని మోడీ కూడా పిల్లలు తప్పులు చేస్తారని, వారు తమ తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు తనపై అనుచిత వ్యా్ఖ్యలు చేసిన వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు. మైనర్ బాలిక తల్లి ఇది తన బిడ్డకు మోడీ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ పరిణామాల తర్వాత ఫిర్యాదుదారు కూడా తన కేసును వాపస్ తీసుకున్నారు.

