Site icon NTV Telugu

Ayodhya: అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం.. ఎకరం విస్తీర్ణం దగ్ధం

Ayodhya1

Ayodhya1

అయోధ్యలోని యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌ఘాట్‌లో బటి బాబా ఆశ్రమం సమీపంలో ఉన్న మహాలక్ష్మి నారాయణ యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద పందిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 10 అగ్నిమాపక వాహనాలు రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చాయి.

అగ్ని ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ అన్నారు. మార్చి 20 నుంచి మార్చి 28 వరకు యజ్ఞం జరిగిందని.. తొమ్మిది రోజుల పాటు జరిగిన మహాయజ్ఞం ముగిశాక ఈ అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడించారు. యజ్ఞశాల ఖాళీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. కానీ లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు చెప్పారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉన్న యజ్ఞశాల నిమిషాల వ్యవధిలోనే బూడిదైపోయింది. ఈ భారీ అగ్నిప్రమాదం రామ మందిరానికి కేవలం 800 మీటర్ల దూరంలో జరిగింది.

శనివారం ఉదయం సుమారు 11:30 గంటలకు పూర్ణాహుతితో యజ్ఞం ముగియగానే.. భక్తులు ఇళ్లకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, దర్యాప్తు చేసేందుకు ఒక సాంకేతిక బృందాన్ని పంపుతామని మంత్రి తెలిపారు. యంత్రాంగం ఈ విషయంపై దర్యాప్తు చేస్తోందని, అసలు కారణం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

 

Exit mobile version