Viral Video: ప్రధాని మోదీ వస్తున్నారని.. ఎండిపోయిన గడ్డికి గ్రీన్ కలర్

Madhya Pradesh

Madhya Pradesh

Viral Video: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 11, 12 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ప్రవాసీ భారతీయ సమ్మేళనం జరగనుంది. ‘మధ్యప్రదేశ్‌-ది ప్యూచర్‌ రెడీ స్టేట్‌’ పేరుతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్ సీఎం హాజరుకానున్నారు. అంతేకాకుండా రిలయన్స్, టాటా, అదానీ, బిర్లా వంటి 70 మంది వ్యాపారవేత్తలు రానున్నారు. ఈ మేరకు రోడ్ల పక్కన డివైడర్లపై గడ్డి ఎండిపోవడంతో అధికారులు గ్రీన్ కలర్ పిచికారీ చేయిస్తున్నారు. కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

Read Also: Karnataka: శ్రీరామ్ సేన కార్యకర్తపై దుండగుల కాల్పులు..

ఎందరో అతిరథ మహారథులు ఈ సమ్మిట్‌కు హాజరవుతుండటంతో రోడ్డు పక్కన డివైడర్ల మధ్యన గడ్డి ఎండిపోయి దర్శనమిచ్చింది. దీంతో అప్పటికప్పుడే గడ్డి రంగునే అధికారులు మార్చేయించారు. స్ప్రే పెయింటర్‌ను తీసుకొచ్చి ఎండు గడ్డిపై గ్రీన్‌ కలర్‌ను పిచికారీ చేయించారు. అలా ఎండు గడ్డికి కలరింగ్ ఇచ్చి తాజాగా ఉన్నట్లు బుకాయించే ప్రయత్నం చేశారు. బీజేపీ ప్రభుత్వాలు బుకాయిస్తున్న తీరు ఇక్కడి పనుల్లో కనపడుతోందని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అటు కమలనాథులారా కలరింగ్‌ అంటే ఇదేనా? వావ్‌ శివరాజ్‌ వావ్‌ అంటూ ఓ కాంగ్రెస్ నేత సెటైర్‌ వేశారు.