పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీలో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్పైగురి జిల్లాలో మమత పాదయాత్రగా వెళ్తూ ప్రజలను కలుస్తున్నారు. ఇంతలో సెక్యూరిటీని దాటుకుంటూ ఒక కుర్రాడు మమత దగ్గరకు వచ్చేశాడు. దీంతో మమతా బెనర్జీ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కొద్ది సేపు రోడ్డుపై అలానే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని యథావిధిగా ర్యాలీ కొనసాగించారు. వెంటనే భద్రతా సిబ్బంది యువకుడిని పక్కకు లాక్కుని వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత మమతా బెనర్జీ తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు.
యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు రావాల్సి వచ్చింది అన్నదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు భద్రతా ఏర్పాట్లపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భవిష్యత్లో మరోసారి ఇలాంటి పరిణామాలు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రొటోకాల్ను సమీక్షిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని మమత చెప్పారు. బెంగాల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
