దేశంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు.. ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రెండేసి స్థానాలు, పుదుచ్చేరిలో ఒకటి ఉన్నాయి. ప్రద్యుత్ బోర్డోలోయ్ రాజీనామాతో ఖాళీ అయిన అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలన్నింటికీ సెప్టెంబర్ 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది.
బెంగాల్ ఉప ఎన్నికలపై అందరి దృష్టి
పశ్చిమ బెంగాల్లోని రెజినగర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండటంతో అందరి దృష్టి వాటిపైనే ఉంది. నౌడా నుంచి కూడా గెలిచిన హుమాయున్ కబీర్.. రెజినగర్ స్థానాన్ని ఖాళీ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి సువేందు అధికారి తన భవానిపూర్ స్థానాన్ని ఉంచుకుని నందిగ్రామ్ స్థానాన్ని వదులుకున్నారు. ఈ కారణంగానే రెజినగర్, నందిగ్రామ్లలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
మమతా ఎన్నికల్లో పోటీ చేస్తారా?
ప్రస్తుతం కోల్కతాలో అత్యంత చర్చనీయాంశం ఏమిటంటే.. మమతా బెనర్జీ ఈ రెండు సీట్లలో దేని నుంచైనా పోటీ చేస్తారా? లేదా అన్నది చర్చించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన రాజకీయ పరిణామాలను, అసెంబ్లీలో గానీ, లోక్సభలో గానీ మమతా బెనర్జీ పార్టీని విచ్ఛిన్నం చేసిన తీరును దృష్టిలో ఉంచుకుని.. మమత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి సభలోకి ప్రవేశించాలని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైతే ఆమె సభలో ప్రస్తుత సమస్యలను సమర్థవంతంగా లేవనెత్తగలరని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా మమతా బెనర్జీ ఎమ్మెల్యే అయితే.. ఆమె ప్రతిపక్ష నాయకురాలుగా కూడా మారి పార్టీని కాపాడుకోగలరు. మమతా బెనర్జీ వీధి, నిరసన రాజకీయాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ అసెంబ్లీలో ఉండటం ఆమెను మరింత ప్రభావవంతంగా మార్చగలదు.
మమతకు ఏ సీటు సురక్షితం?
ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. మమతా బెనర్జీకి ఏ సీటు అత్యంత సురక్షితమైనది? గణాంకాలను పరిశీలిస్తే.. మమతా బెనర్జీకి నందిగ్రామ్ అత్యంత సురక్షితమైనదిగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పటికీ.. సువేందు అధికారి నందిగ్రామ్లో కేవలం 9,665 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో మమతా బెనర్జీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే.. ఆమెకు విజయం సులభం అవుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి 2021లోనే నందిగ్రామ్లో మమతా బెనర్జీ-సువేందు అధికారిల మధ్య పోటీ జరిగింది. అప్పుడు సువేందు 1,956 ఓట్ల తేడాతో మమతా బెనర్జీని ఓడించారు.
ఇక రెజినగర్ సీటు విషయానికి వస్తే ఇది ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అధిర్ రంజన్ చౌదరి పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెజినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 65 శాతం ముస్లిం జనాభా ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేయడం పశ్చిమ బెంగాల్లోని మైనారిటీలకు సానుకూల సందేశాన్ని పంపుతుంది. ఈ రెండు సీట్లలో జరిగే ఉప ఎన్నికల కోసం మమతా బెనర్జీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని నిపుణులు కూడా భావిస్తున్నారు. దీంతో రెజినగర్ సీటు తృణమూల్కు సులభతరం కాగా.. నందిగ్రామ్ సీటును అదే ప్రాంతానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సుభంకర్ సర్కార్కు వదిలేస్తే ఈజీగా గెలవవచ్చని భావిస్తున్నారు.
అయితే మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదనేది కూడా వాస్తవం. 2011లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సుబ్రతా బక్షి ఆమె కోసం ఆ సీటును ఖాళీ చేశారు. ఈసారి మమతా బెనర్జీ ఉప ఎన్నికలో పోటీ చేసి ప్రతినిధుల సభలోకి ప్రవేశిస్తారా లేక వీధి రాజకీయాలను కొనసాగిస్తారా అన్నదే అతిపెద్ద ప్రశ్న.

