Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు. తనను ఆపాలంటే చంపాల్సిందే అని అంటూనే, తిరుగుబాటు వర్గాన్ని ద్రోహులుగా దుయ్యబట్టారు. కోల్కతాలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, పార్టీ ఎన్నికల గుర్తు తమ వద్దే ఉందని, గుర్తు ఎవరూ తీసుకెళ్లలేరని అన్నారు.
తిరుగుబాటు వర్గం ఎన్నికల సంఘం ముందు న్యాయపోరాటాన్ని ఎదుర్కోవాల్సిందే అని అన్నాను. తనను రాజకీయంగా ఆపాలంటే చంపాల్సిందే అని అన్నారు. ఇదిలా ఉంటే, శనివారం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మమతా బెనర్జీకి ‘‘రైట్ హ్యాండ్’’గా భావించే చంద్రిమా భట్టాచార్య అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేశారు. దీని తర్వాత ఆమె రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ వర్గంతో కలిసి కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తిరుగుబాటు నేతలు ఒత్తిళ్ల కారణంగానే పార్టీని వీడారని మమత దుయ్యబట్టారు. ఎన్నటికీ బీజేపీ ముందు తలవంచబోనని, టీఎంసీ సిద్ధాంతాలు ఎప్పటికీ బీజేపీకి వ్యతిరేకమే అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రెబల్ వర్గం ఆక్రమించుకోవడంపై స్పందిస్తూ.. కోల్కతా పార్టీ ఆఫీస్ లీజుపై తీసుకున్నదేనని దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని అన్నారు. చంద్రిమా రాజీనామాతో పార్టీ రాష్ట్ర, జాతీయ వ్యవహారాలను తానే నేరుగా పర్యవేక్షిస్తానని మమతా చెప్పారు. తన నివాసాన్ని పార్టీ ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తానని వెల్లడించారు.

