Mamata Banerjee Protest: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా భారీ ధర్నాలో పాల్గొన్నారు. మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి తర్వాత ఆమె బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా చేశారు. బీజేపీని అధికారం నుంచి తొలగించే వరకు చావనని దీదీ అన్నారు. అయితే, మంగళవారం కోల్కతాలో జరిగిన ఈ ధర్నాకు టీఎంసీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంత పెద్ద కార్యక్రమానికి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 6 మంది మాత్రమే హాజరుకావడం మమతను షాక్కు గురిచేసింది.
సీనియర్ శాసనసభ్యులు చంద్రమా భట్టాచార్య, శోభన్దేబ్ చటోపాధ్యాయ, నయన బంద్యోపాధ్యాయ, మదన్ మిత్రా, అశోక్ దేబ్, అషిమా పాత్రలతో సహా కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ ఎంపీలు డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీ, డెరెక్ ఓ’బ్రియన్ కూడా పాల్గొన్నారు. మొత్తం 29 మంది ఎంపీలకు గానూ కేవలం ముగ్గురు మాత్రమే వచ్చారు. అంతకుముందు, అభిషేక్ బెనర్జీ దాడి తర్వాత, మమత తన ఇంట్లో ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిస్తే 80 మంది ఎమ్మెల్యేలకు గానూ కేవలం 20 మంది వచ్చారు. ఇప్పుడు ఆ సంఖ్య 6కే పరిమితమైంది.
ఇదిలా ఉంటే, తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం తీవ్రమవుతుందని తెలుస్తోంది. రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆయనను మమతా బెనర్జీ బహిష్కరించారు. చాలా మంది ఎమ్మెల్యేలు రిటబ్రతతో టచ్లో ఉన్నారు. వీరంతా మమతా బెనర్జీ నుంచి పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
