Kharge vs BJP: మోడీ టెర్రరిస్ట్.. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

  • మోడీ‌పై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు
  • కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
  • చర్యలు తీసుకోవాలని డిమాండ్
Mallikarjun Kharge

Mallikarjun Kharge

ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీని ఉద్దేశిస్తూ ‘టెర్రరిస్ట్’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, నిర్మలా సీతారామన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖర్గే వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, పరువు నష్టం కలిగించే చర్య అని, ఎన్నికలను ప్రభావితం చేయగల తీవ్రమైన ఆరోపణ అని పేర్కొంది. ఖర్గేపై చర్య తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

ఫిర్యాదులో ఏముందంటే..
మోడీని ‘‘ఉగ్రవాది’’ అని పిలవడం వ్యక్తిగత దూషణ, తీవ్రమైన వ్యక్తిగత దాడి, ప్రజల ప్రజాస్వామ్య ఎంపికను ప్రభావితం చేసే ప్రయత్నమని బీజేపీ పేర్కొంది. ఈ వ్యాఖ్య భారత శిక్షా స్మృతి (ఐపీసీ), 2023లోని సెక్షన్లు 175, 171/174 (అనుచిత ప్రభావం), 356(1) (పరువు నష్టం)తో సహా వివిధ సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది. ఈ వ్యాఖ్యను తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ/ఉపసంహరణ జారీ చేయాలని, అవసరమైన ఎన్నికల ఆంక్షలు విధించాలని, అభ్యంతరకరమైన సమాచారం వ్యాప్తిని నిషేధించాలని ఆ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.

అమిత్ షా ఖండన..
‘‘కాంగ్రెస్ పార్టీ తన ప్రవర్తనలో రోజురోజుకీ మరింత దిగజారుతూ ప్రజా చర్చల స్థాయిని తగ్గించడంలో తన సొంత రికార్డులనే బద్దలు కొడుతోంది. ఖర్గే.. ప్రజా ప్రవర్తనా ప్రమాణాలన్నింటినీ ఉల్లంఘిస్తూ.. భారతదేశం ఎన్నుకున్న ప్రధానమంత్రి మోడీని ఉగ్రవాది అని పిలిచి దేశాన్ని అవమానించారు. దేశ అత్యున్నత నాయకుడికి జరిగిన ఈ అవమానం.. మోడీని ప్రేమించి, మద్దతిచ్చే లక్షలాది మంది ప్రజలకు జరిగిన అవమానం.’’ అని అన్నారు. గత 12 ఏళ్లలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించిన మోడీ లాంటి నాయకుడిని ఉగ్రవాది అని పిలవడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు.