Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్

  • లక్నో కోచింగ్ సెంటర్‌లో ఘోర విషాదం
  • భారీ అగ్నిప్రమాదంలో 15 మంది చిన్నారులు సజీద దహనం
  • విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
Upminister

Upminister

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోచింగ్ సెంటర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బిల్డింగ్‌లో అంటుకున్న మంటలు.. క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. దీంతో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మంటల్లో కాలి బూడిదయ్యారు. దాదాపు 15 మంది సజీవ దహనం అయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఈ ఘటనపై డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తీవ్ర దు:ఖానికి గురయ్యారు. ప్రాణాలు కోల్పోయిన అమాయకుల పట్ల సంతాపం తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సంయమనాన్ని కోల్పోయి.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఆద్యంతం కన్నీటి పర్యంతం అయ్యారు. ‘నేను 14 మృతదేహాలను నా కళ్లారా చూశాను.’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు.

×
×
Ad

ఘటన జరిగిన సమయంలో యానిమేషన్ కేంద్రంగా పనిచేస్తోందని.. అక్కడ 15, 16, 17 ఏళ్ల పిల్లలు వేసవి సెలవుల్లో కార్టూన్ మేకింగ్, యానిమేషన్ నేర్చుకోవడానికి వచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు.
మంటలు చెలరేగిన వెంటనే పిల్లలు తమను తాము కాపాడుకోవడానికి వెనుక వైపుకు పరుగెత్తారు. ఆ కేంద్రం లోపల చాలా చెక్క ఫర్నిచర్ ఉంది. ఆ మంటల వల్ల వెలువడిన దట్టమైన, విషపూరితమైన పొగ పిల్లలను చుట్టుముట్టడంతో వారు బయటకు రాలేకపోయారన్నారు. ఇప్పటివరకు 15 మంది పిల్లల మృతదేహాలు లభ్యం కాగా.. వారిలో 14 మందిని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. గాయాలతో ఉన్న పిల్లలను చికిత్స కోసం వెంటనే కేజీఎంసీ ట్రామా సెంటర్‌కు తరలించారు.

ఇక ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలీగఢ్‌లో తన షెడ్యూల్ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించారు.ఇదిలా ఉంటే ఇదే నెలలో ఢిల్లీ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 12 మంది విదేశీయులు ఉన్నారు.