LPG BOOKINGS: దేశంలో వంట గ్యాస్ (LPG) డిమాండ్ తీరు మారిందని, ప్రజల్లో ఆందోళన పెరిగిందని, దీంతో ఎక్కువగా ఎల్పీజీని కొనుగోలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, దేశంలో వంట గ్యాస్ కొరత లేదని, ఎల్పీజీ ఉత్పత్తి 30 శాతం మేర పెరిగిందని తెలిపింది. యుద్ధానికి ముందు సగటున ఒక రోజు 55.7 లక్షల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ ఉంటే, ఇప్పుడు ఇది 75.7 లక్షలకు చేరుకుందని, ఇది ప్రజల్లో ఉన్న ఆందోళనను తెలియజేస్తుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.
Read Also: Affair: వదినతో అక్రమ సంబంధం.. తల్లిని హత్య చేసిన చిన్న కొడుకు..
ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. ఆందోళన చెంది ‘‘పానిక్ బుకింగ్స్’’ చేయవద్దని సూచించారు. రోజుకు అదనంగా 25 లక్షల సిలిండర్లు బుక్ అవుతున్నట్లు తెలిపారు. ఎల్పీజీ వినియోగదారుల ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ కాల్ సెంటర్లను బలోపేతం చేసినట్లు కేంద్రం చెప్పింది. కాల్ సెంటర్ల సంఖ్య 400కు పెంచడంతో పాటు టెలిఫోన్ లైన్లు 50 వరకు పెంచినట్లు తెలిపింది. దీంతో వినియోగదారులు తమ సమస్యల్ని ఈజీగా నమోదు చేసుకోవచ్చు.
బ్లాక్ మార్కెటింగ్, అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలు ఈ వ్యవహారాల్లో కీలకంగా పనిచేయాలని సూచించింది. మరోవైపు, సమస్యల్ని పరిష్కరించేందుకు పలు రాష్ట్రాలు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాయి. ఇంధన సరఫరాకు సంబంధించి రాష్ట్రాలకు నిరంతర సమన్వయం, సహకారం ఉంటుందని కేంద్రం చెప్పింది.
