ఎన్నికల సంఘం ఢిల్లీలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సంచలనంగా మారింది. ఓటర్ల వివరాలలో వ్యత్యాసాల నేపథ్యంలో పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కూడా SIR నోటీసులు వెళ్లాయి. అద్వానీతో పాటు నోటీసులు అందుకున్న ప్రముఖుల్లో కేంద్రమంత్రి ఎస్ జైశంకర్, మాజీ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్, ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలు ఉన్నారు.
ఢిల్లీలో సుమారు 33.13 లక్షల మంది ఓటర్లకు వారి ఎన్యూమరేషన్ ఫారాల్లో నమోదైన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల అధికారులు నోటీసులు పంపుతున్నారు. ఇప్పటి వరకు 31.63 లక్షలకు పైగా నోటీసులు అందజేసినట్లు ఢిల్లీ ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎల్కే అద్వానీ, ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతిక పేర్లు 2002లో జరిగిన గత SIR ఓటరు జాబితాతో మ్యాప్ కాలేదు. దీంతో వారికి నోటీసులు జారీ అయ్యాయి. అద్వానీ కుటుంబంలోని నలుగురూ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. ఎస్ఐఆర్ నోటీసులు వచ్చినంత మాత్రాన ఓటర్ జాబితా నుంచి పేరు తొలిగిపోయినట్లు కాదు, సరైన పత్రాలు సమర్పించి మళ్లీ నమోదు చేసుకోవచ్చు.

