Wedding: హాయిగా సాగాల్సిన పెళ్లి వేడులకు కుస్తీ పోటీని తలపించింది. పెళి వేడుకలోనే పెళ్లికూతురు బంధువులు, వరుడి కుటుంబంపై దాడి చేశారు. వీటన్నింటికి ఓ ‘ముద్దు’ కారణమైంది. పెళ్లివేడుల సమయంలో వరడు, వధువుకు ముద్దు పెట్టాడు. తన ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయడమే ఆయన చేసిన తప్పు. వరమాల వేడుక సమయంలో పెళ్లి పెటాకులైంది. వేదికపై ఉన్న వరుడి బంధువులను వధువు కుటుంబ సభ్యులు కొట్టడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.
ఈ ఘటన సోమవారం ఉత్తర్ ప్రదేశ్ హాపూర్లోని అశోక్ నగర్లో చోటు చేసుకుంది. వరుడు, వధువుకు ముద్దుపెట్టుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపటికే వధువు కుటుంబ సభ్యులు కర్రలు పట్టుకుని వేదికపైకి ఎక్కి వరుడి కుటుంబీకులను కొట్టారు. ఈ ఘర్షణలో వధువు తండ్రి సహా ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Read Also: Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన హమాస్, హౌతీ, తాలిబాన్ లీడర్స్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి వధువు తండ్రి తన ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించారు. మొదటి పెళ్లి ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగింది. అయితే రెండో పెళ్లి మాత్రం కుస్తీ పోటీని తలపించింది. వరుడు, వధువుకు బలవంతంగా ముద్దు పెట్టాడని వధువు తరుపు బంధువులు పేర్కొనగా, వరమాల తర్వాత తనను ముద్దు పెట్టుకోవాలని పెళ్లికూతురే కోరిందని వరుడు చెప్పారు. ఈ కేసులో ఇరు కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని హాపూర్ సీనియర్ పోలీసు అధికారి రాజ్కుమార్ అగర్వాల్ తెలిపారు.
ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాలు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాయి. అయితే, వధూవరులు మాత్రం తామిద్దరం పెళ్లి చేసుకోవాలనే కోరికను పెద్దలకు చెప్పారు. దీంతో పెద్దల జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలతో చర్చలు ప్రారంభించారు. పెళ్లిని తర్వాత తేదీకి మార్చాలనే ఉద్ధేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.