Ketan Agarwal Murder: పూణేలో సంచలనం సృష్టించి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం ఎదురైంది. కేతన్ను అతడికి కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరిలు కలిసి లోహగఢ్ కోట పైనుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో మూడో వ్యక్తి చేతన్ స్నేహితుడు రితేష్ హింగేని పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్కు చెందిన రితేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో హత్య పథకం గురించి రితేష్కు తెలుసని, చేతన్ తన ప్రణాళికల్ని ఎప్పటికప్పుడు రితేష్తో పంచుకున్నట్లు ఎస్పీ సందీప్ సింగ్ గిల్ చెప్పారు.
అయితే, ఈ కేసులో ముందుగా కేతన్ను కిరాయి హంతకుడితో హత్య చేయించాలని చేతన్, సియాలు భావించారని, తర్వాత చేతన్, సియాలో హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. దర్యాప్తు సమయంలో రితేష్కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. హత్యకు ముందు రితేష్ హత్య జరిగిన లోహగఢ్ కోటను సందర్శించాడా? లేదా ? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కేతన్కు తీవ్రమైన గాయం లేదా, శరీరంలో ఏదైనా భాగానికి నష్టం కలిగించేలా ముగ్గురు ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఒకవేళ కేతన్కు తీవ్ర గాయాలైనా లేదా అతని శరీరంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నా, సియాతో జరగబోయే అతని వివాహాన్ని అడ్డుకోవచ్చని నిందితులు భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు సమయంలో ఈ కుట్రలో రితేష్ కూడా ఉన్నట్లు తేలిందని, దీంతో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు డిజిటల్ ఆధారాలపై కూడా పనిచేస్తున్నారు. పోలీసుల ప్రకారం, తొలగించబడిన వాట్సాప్ చాట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చాట్లు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను ఫోరెన్సిక్ పద్ధతిలో పరిశీలిస్తున్నారు.

