Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా

  • కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన
  • నిర్ణయం రేపటికి వాయిదా
  • రేసులో కేసీ.వేణుగోపాల్, సతీశన్, రమేష్ చెన్నితాల
Rahulgandhi

Rahulgandhi

కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రకటించలేదు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ హైకమాండ్ చర్చించింది. తాజాగా బుధవారం కూడా మరోసారి ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు చర్చించారు. కానీ సీఎం ఎంపికపై మాత్రం ఓ కొలిక్కి రాలేదు. అధిష్టానం మల్లాగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి ఎంపికపై గురువారం మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.

140 సభ్యులున్న కేరళం అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు దక్కించుకోగా.. ముస్లిం లీగ్ 22 స్థానాలు, కేరళ కాంగ్రెస్ 8 స్థానాలు, విప్లవ సోషలిస్టు పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించినప్పటికీ సీఎం ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతోంది.

తొలుత ముఖ్యమంత్రి రేసులో కేసీ.వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనంతరం సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు తెరపైకి రావడంతో పార్టీలో వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక హైకమాండ్ టెన్షన్ పడుతోంది. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రేపు అయినా నిర్ణయిస్తుందా? లేదంటే పొడిగిస్తుందా? అన్నది చూడాలి.