ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర హల్చల్ చేశారు. ఈ సందర్భంగా E20 పెట్రోల్ గురించి వాహనదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ E20 పెట్రోల్ విధానంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. E20 పెట్రోల్ కారణంగా వాహనాల మైలేజ్ తగ్గిపోతోందని.. ఇంజిన్ సమస్యలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని ఓ పెట్రోల్ బంక్, వాహనాల సర్వీస్ సెంటర్ను స్వయంగా సందర్శించి వాహనదారులతో మాట్లాడారు.
పెట్రోల్ బంక్, సర్వీస్ సెంటర్లో వినియోగదారులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. కేంద్రం చెబుతున్నది వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. ‘‘నేడు ఢిల్లీలోని ఒక పెట్రోల్ బంక్, సర్వీస్ స్టేషన్కు వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించాను. ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోంది. E20 పెట్రోల్ వల్ల వాహనాలకు నిజంగానే సమస్యలు వస్తున్నాయి. సాధారణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాదాపు అన్ని వాహనాల మైలేజ్ తగ్గిపోయింది. ఇంజిన్ పనితీరుపై కూడా అనేక ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.’’ అని కేజ్రీవాల్ అన్నారు.
ఎందుకు వివాదం?
దేశవ్యాప్తంగా 2025 నుంచి E20 పెట్రోల్ను అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమంగా ఉంటుంది. వాస్తవానికి ఈ లక్ష్యాన్ని 2030 నాటికి అమలు చేయాలని కేంద్రం భావించినప్పటికీ.. ఐదేళ్ల ముందుగానే దేశవ్యాప్తంగా అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇథనాల్ మిశ్రమం వల్ల ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని, చెరకు రైతులకు ఆదాయం పెరుగుతుందని చెబుతోంది. అయితే పాత వాహనాలకు E20 పెట్రోల్ అనుకూలమా? మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్పై ప్రభావం ఉంటుందా? అనే అంశాలపై వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వాహన కంపెనీలకు కేజ్రీవాల్ లేఖ
కొద్ది రోజుల క్రితం టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ సహా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు కేజ్రీవాల్ లేఖ రాశారు. 2023కు ముందు తయారైన వాహనాలకు E20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమేనా? మైలేజ్ తగ్గినా లేదా వాహనానికి నష్టం జరిగినా వినియోగదారులకు పరిహారం ఇస్తారా? అనే అంశాలపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. వినియోగదారులకు తక్కువ ఇథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్ను తిరిగి అందించే ఆలోచన లేదని స్పష్టం చేయడాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు ప్రత్యామ్నాయం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేస్తోంది. విస్తృత స్థాయి పరీక్షల అనంతరమే ఈ విధానాన్ని అమలు చేశామని, దేశ ఇంధన భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించడంలో E20 కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రం పేర్కొంటోంది.
आज मैंने दिल्ली के एक पेट्रोल पंप और सर्विस स्टेशन पर जाकर ज़मीनी हक़ीक़त जानी। सरकार सफ़ेद झूठ बोल रही है। E20 के कारण गाड़ियों में सच में दिक्कतें आ रही हैं। आम लोग ethanol से बहुत दुखी हैं। लगभग सभी लोगों की माइलेज कम हुई है और बहुत गाड़ियों में ख़राबी की शिकायत हैं। pic.twitter.com/ygVqeQ52Zo
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 11, 2026

