కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. పొలంలో 26 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కన్న తల్లి ఏ స్థితిలో ఉందో తెలియక.. పాపం.. పుణ్యం ఎరుగని రెండేళ్ల చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ‘అమ్మా.. లే’ అంటూ ఏడుస్తూ కనిపించిన దృశ్యం స్థానిక రైతులను కలిచి వేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతురాలు రాయచూర్కు చెందిన స్నేహగా పోలీసులు గుర్తించారు. సింధనూర్ తాలూకాలోని ఓ పొలంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మహిళ తల, శరీరంపై రాయితో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహకు నాలుగేళ్ల క్రితం అమిత్తో వివాహం జరిగింది. అయితే సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో నాలుగు నెలల నుంచి శుభమ్ అనే యువకుడితో స్నేహ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే స్నేహ హత్యకు గురైంది. అయితే చిన్నారి తల్లి శవంపై పడి ఏడుస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ సన్నివేశాన్ని చూసిన వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మృతురాలి భర్త అమిత్తో పాటు ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తి శుభమ్ ఉన్నాడు. స్నేహకు శుభమ్తో అక్రమ సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని రాయచూర్ ఎస్పీ అరుణాంశు గిరి తెలిపారు. ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నామని.. అసలు ఏం జరిగింది? స్నేహను ఎవరు హత్య చేశారు? అనే విషయాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు.

