Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?

  • కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక
  • అధిష్టానంతో కీలక చర్చలు
  • మరో సంక్షోభం తప్పదా?
Karnataka

Karnataka

కర్ణాటకలో బుధవారం డీకే.శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. మరోవైపు కొత్త మంత్రివర్గ కూర్పుపై అధిష్టానంతో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మాజీ హోంమంత్రి, దళిత నాయకుడు పరమేశ్వర అలక బూనినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి పదవిపై పరమేశ్వర ఆశ పెట్టుకున్నారు. కానీ అప్పుడు ఆశలు.. అడియాశలయ్యాయి. మరోసారి అవకాశం వస్తుందని అనుకుంటే.. ఇప్పుడు డీకే.శివకుమార్ రూపంలో ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ నేపథ్యంలో పరమేశ్వర అలకబూనినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ఆవేదనను హైకమాండ్ దగ్గర వెళ్లబుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

తనకు ప్రస్తుతం ఉన్న హోంశాఖకు బదులుగా మరో కీలక శాఖ ఇవ్వాలని కూడా పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన పరమేశ్వర తన మనసులోని అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి కోసం రెండోసారి అవకాశం కోల్పోవడం తనకు నిరాశ కలిగించిందని చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే హోం శాఖకు బదులుగా మరో శాఖ కేటాయించాలని కోరినట్లు సమాచారం.

×
×
Ad

దళిత వర్గాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పొందిన పరమేశ్వర ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి పదవిపై తన ఆసక్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా తాను సీఎం రేసు నుంచి ఎప్పుడూ బయటపడలేదని పేర్కొన్నారు. నాయకత్వ మార్పు జరిగితే దళిత వర్గానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి ఇవ్వాలని పలువురు కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకత్వ మార్పు అవసరమని కాంగ్రెస్ అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాల మేరకు తాను రాజీనామా చేశానని సిద్ధరామయ్య కూడా వెల్లడించారు. మే 28న ఆయన రాజీనామా సమర్పించడంతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇప్పుడు పరమేశ్వర అసంతృప్తి వార్తలు బయటకు రావడంతో కాంగ్రెస్‌లో అన్ని వర్గాలు సంతృప్తిగా లేవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై పరమేశ్వర లేదా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇది కొత్త చర్చకు దారితీసింది.