కర్ణాటకలో ఓ న్యాయమూర్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆస్పత్రిలోని ఓ గదిలో ప్రియురాలితో అధికారి పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అక్రమ ఖాతాలకు సంబంధించిన కేసులో లోకాయుక్త పోలీసులు శ్రీరంగపట్నంలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ (ADLR)గా పనిచేస్తున్న మహమ్మద్ హుస్సేన్ను అరెస్టు చేశారు. అయితే సదరు అధికారిని జైలుకు తరలించాల్సి ఉండగా.. ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచారు. అయితే మండ్య జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి. చంద్రశేఖర్ ఆకస్మికంగా ఎంఐఎంఎస్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అయితే ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించిన న్యాయమూర్తికి.. హుస్సేన్ ఉన్న గదిని కూడా పరిశీలించారు. అయితే ఆ గదిలో ఓ యువతి కనిపించడం కలకలం రేపింది. ఎందుకు ఇక్కడ ఉన్నావని అడిగితే తాను సదరు అధికారి ప్రియురాలినని చెప్పడంతో అంతా షాక్కు గురయ్యారు. దీంతో హుస్సేన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను జడ్జి ప్రశ్నించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందాల్సినంత తీవ్రమైన అనారోగ్యం లేదన్న విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది.
జైలు నుంచి హుస్సేన్ను ఆస్పత్రికి తరలించడానికి గల కారణాలను కూడా న్యాయమూర్తి జైలు అధికారులను ప్రశ్నించారు. జైలు వైద్యుడి సిఫారసు మేరకే హుస్సేన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారులు చెప్పినట్లు సమాచారం. జైలు నుంచి ఆస్పత్రికి హుస్సేన్ను తరలించిన విషయం కోర్టుకు తెలియజేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే కోర్టుకు సమాచారం ఇవ్వలేదని ఓ జైలు అధికారి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి విషయాలను కోర్టు దృష్టికి తీసుకువస్తామని అధికారి చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై న్యాయమూర్తి జైలు అధికారులను మందలించారు. హుస్సేన్ ఆస్పత్రిలో చేరడం, అక్కడ ఉన్న పరిస్థితులపై జైలు అధికారులు, వైద్యాధికారులు పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

