Karnataka: రోడ్డుకు సిద్ధరామయ్య పేరు.. మండిపడ్డ విపక్షం

  • రోడ్లకు సిద్ధరామయ్య పేర్లు.. మండిపడ్డ విపక్షం
  • మైసూరు నగరంలోని కేఆర్ఎస్ రోడ్డుకు సిద్ధరామయ్య ఆరోగ్య మార్గ్ అనే పేరు
Siddharamaiah

Siddharamaiah

కర్ణాటకలో రహదారుల పేర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. మైసూరులోని ఒక రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఇందుకు ప్రజల నుంచి 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. దీనిపై జనతా దళ్ పార్టీ విమర్శలు గుప్పించింది. సిద్ధరామయ్య అవినీతి ఆరోపణలపై కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారంటూ ‘ఎక్స్’లో జేడీఎస్ విమర్శించింది.

ఇది కూడా చదవండి: Suvendu Adhikari: బీజేపీ నేత సువేందు అధికారిపై దాడికి బంగ్లాదేశ్ టెర్రరిస్టు గ్రూపుల కుట్ర..

మైసూరు నగరంలోని కేఆర్ఎస్ రోడ్డుకు సిద్ధరామయ్య ఆరోగ్య మార్గ్ అనే పేరు పెట్టాలని మైసూరు మెట్రోపాలిటన్ కార్పొరేష్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని తప్పుపట్టింది. ముడాలో అక్రమంగా స్థలం పొంది, మోసానికి పాల్పడిన కేసులో సిద్ధారమయ్య ఏ1 నిందితుడిగా ఉన్నారని… కోర్టు, లోకాయుక్త విచారణను ఆయన ఎదుర్కొంటున్నారని జేడీఎస్ తెలిపింది. మైసూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికైన బోర్డు కాదని, అధికారులను రాష్ట్ర ప్రభుత్వమే నియమించిందని జేడీఎస్ పేర్కొంది. ప్రతిఫలంగా మైసూరు సిటీ రోడ్డుకు సిద్ధారమయ్య పేరు పెట్టాలని అధికారులు ప్రతిపాదన చేసినట్టు ఆరోపించింది. అవినీతి ముఖ్యమంత్రి పేరును ఒక రోడ్డుకు పెట్టడం అంటే మైసూరు సిటీని, రాష్ట్రాన్ని అవమానించడమే అవుతుందని అభ్యంతరం తెలిపింది. మెటగల్లిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సర్కిల్, రాయల్ ఇన్ జంక్షన్ మధ్య ఉన్న రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం.