Farmers: రైతులను వివాహం చేసుకునే మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథ్ ఆ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. తుమకూరు జిల్లాలోని కునిగల్ నియోజవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న రంగనాథ్ తన లేఖలో రైతుల పరిస్థితిని వివరించారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో వ్యవసాయంపైనే చాలా కుటుంబాలు ఆధారపడ్డాయని, వ్యవసాయం చేస్తున్న యువకులను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే మహిళలకు ప్రత్యేక అలవెన్సులు, ప్రత్యేక హోదా ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను కోరారు.
కునిగల్ తాలూకా ప్రధానంగా గ్రామీణ ప్రాంతమని, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉందని, ఈ ప్రాంతంలో చాలా మంది యువకులు జీవనోపాధి వ్యవసాయమే అని ఆయన అన్నారు. రైతులుగా ఉన్న యువకులను మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని, దీంతో 30 ఏళ్లు దాటిని కూడా రైతులకు పెళ్లిళ్లు కావడం లేదని వాపోయారు. గ్రామీణ వ్యవసాయ వర్గాల్లో వివాహిలను ప్రోత్సహించడానికి సహాయక చర్యలు చేపట్టాలని సీఎంను అభ్యర్థించారు.
కర్ణాటకలో రైతు సంఘాలు కూడా గతంలో ఇలాంటి ఆందోళల్నే లేవనెత్తాయి. రైతులకు ప్రాధాన్యత తగ్గుతుండటంతో మహిళలు వారిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆరోపించాయి. కొన్ని రైతు సంఘాలు రైతు కుటుంబాల సామాజిక స్థితి, ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేదా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మాండ్యా, తుమకూరు వంటి జిల్లాల రైతులు కూడా సీఎం సిద్ధరామయ్యకు ఇలాంటి ప్రతిపాదనలే పెడుతున్నారు.
