Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత ప్రతిష్టంభనను తొలగించేందుకు పార్టీ అధిష్టానం (హైకమాండ్) రంగంలోకి దిగింది. ఈ వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం, ఈరోజు ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీఎం సిద్ధరామయ్యను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించారని చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా కర్ణాటక రాజకీయ సంక్షోభానికి చెక్ పెట్టాలని హైకమాండ్ గట్టి పట్టుదలతో ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్లను కూడా ఢిల్లీకి పిలిపించి చర్చలు జరపనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ సమస్యను పరిష్కరించేందుకు అధిష్టానం ముందు మూడు ప్రధాన మార్గాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
సిద్ధరామయ్యకే పూర్తి స్థాయి పగ్గాలు.. ‘డికె’కు బుజ్జగింపులు
మొదటి ప్రత్యామ్నాయంగా ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం.. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా యథాతథంగా కొనసాగించడం. చాలా కాలంగా వాయిదా పడుతున్న మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించడం ద్వారా పార్టీలో, ప్రభుత్వంలో ఆయన పట్టును మరింత బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోందని చెబుతున్నారు. అయితే దీనివల్ల సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న డి.కె.శివకుమార్ మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో ‘డికె’ను బుజ్జగించేందుకు ఆయనకు మరికొన్ని కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించడం, అలాగే ఆయన సోదరుడికి, సన్నిహితులకు ప్రభుత్వంలో కీలక పదవులు ఇచ్చేలా సిద్ధరామయ్యను ఒప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
సిద్ధరామయ్యకు జాతీయ బాధ్యతలు..
సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావడం అధిష్టానం ముందున్న మరో వ్యూహంగా కూడా చర్చ జరుగుతుంది. ఆయనను ఢిల్లీకి పిలిపించి, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించే అంశాన్ని కూడా కాంగ్రెస్ పరిశీలిస్తోందని అంటున్నారు. ఒకవేళ సిద్ధరామయ్య జాతీయ రాజకీయాలకు వెళ్తే.. కర్ణాటకలో ఎలాంటి విభేదాలు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించడానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సరైన, సురక్షితమైన ఎంపిక అని పార్టీలోని ఒక వర్గం గట్టిగా నమ్ముతోందని చెబుతున్నారు.
డి.కె. శివకుమార్కు సీఎం పీఠం
గతంలో చేసుకున్న అధికార భాగస్వామ్య ఒప్పందానికి అనుగుణంగా.. సిద్ధరామయ్యను ఒప్పించి సీఎం పదవి నుంచి తప్పుకునేలా చేయడం హైకమాండ్ ముందున్న మూడో మార్గం అని అంటున్నారు. దీంతో డి.కె. శివకుమార్ను సీఎంను చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పార్టీ యోచిస్తోందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. ఈ నెలాఖరులోగా అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
