Rahul Gandhi: రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటన సమయంలో రిజర్వేషన్లు, సిక్కులపై మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బెంగళూర్లోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Read Also: Rahul Gandhi: ‘‘సిక్కు’’ వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వీడిన రాహుల్ గాంధీ.. బీజేపీపై ఆరోపణలు..
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని విభజన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, భారత అంతర్గత భద్రత, సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగిస్తున్నారని కర్ణాటక బీజేపీ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ న్యాయమైన ప్రదేశం అయినప్పుడు రిజర్వేషన్లను రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని అన్నారు. జార్జ్టౌన్ యూనివర్సిటీలో విద్యార్థులతో తన సంభాషణల సమయంలో రిజర్వేషన్లపై ఆయన వ్యా్ఖ్యానించారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీ వర్గాలకు ఇప్పటికీన వ్యవస్థలో తగిన భాగస్వామ్యం కల్పించబడలేదని, భారతదేశం అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత లేదని ఆయన అన్నారు.