ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సొంత పార్టీ ఎంపీ స్వాతి మలివాల్తో సీఎం నివాసంలో జరిగిన గొడవ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. కోల్కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీఎం ఏమీ చేయలేదు.. స్పందించలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడంపై సీతారామన్ ప్రశ్నలు సంధించారు. బుధవారం నిందితుడు విభవ్ కుమార్ కేజ్రీవాల్ తో పాటు లక్నో విమానాశ్రయంలో కనిపించారని సీతారామన్ చెప్పారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పనిచేసిన మహిళపై ఇలా ప్రవర్తించడం సిగ్గచేటని మండిపడ్డారు.
READ MORE: Telangana Rains: వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
కాగా.. సీఎం నివాసంలో తనపై దాడి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు శుక్రవారం కేజ్రీవాల్ సన్నిహితుడు విభవ్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి దాదాపు 10 ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. నాలుగు బృందాలు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉండగా.. స్వాతి మలివాల్తో జరిగిన ఘటనను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గ్రహించారని, ఈ విషయంలో ఆయన కఠిన చర్యలు తీసుకుంటారని ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ చెప్పారు.