NTV Telugu Site icon

Nambi Naryanan: నంబి నారాయణ్ గూఢచర్యం కేసు అబద్ధం.. కేరళ హైకోర్టుకు స్పష్టం చేసిన సీబీఐ

Nambi Narayan Case

Nambi Narayan Case

ISRO scientist Nambi’s arrest was illegal, 1994 espionage case was false, CBI informs Kerala HC: ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ పై గూఢచర్యం కేసు అబద్ధం అని అతడి అరెస్ట్ చట్ట విరుద్ధం అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ ) కేరళ హైకోర్టుకు శుక్రవారం స్పష్టం చేసింది. 1994లో ఇస్రో శాస్త్రవేత్త అయిన నంబి నారాయణ్ పై గూఢచర్యం కేసు నమోదు అయింది. ఈ కేసులో నంబి నారాయణ్ నిరుపరాధి అని తేలింది. అయితే తనపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై పోరాడుతున్నారు నంబి. నంబి నారాయణ్ పై విచారణ జరిపిన అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం వీరి బెయిల్ పిటిషన్ విచారిస్తోంది కేరళ హైకోర్టు. ఈ నేపథ్యంలో సీబీఐ.. నకిలీ గూఢచర్య కేసు జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశం అని.. ఇస్రోలోని ప్రముఖ శాస్త్రవేత్తలపై తప్పుడు కేసు పెట్టేందుకు విదేశీ శక్తులు కట్రపన్నాయని సీబీఐ కేరళ హైకోర్టుకు తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాల్లో కీలకమైన క్రయోజనిక్ ఇంజిన్ టెక్నాలజీని నిలిపేసేందుకు ఈ కేసును నంబి నారాయణ్ పై మోపారని ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Read Also: Mahesh Babu: ఇలాంటి క్యారెక్టర్ ఇంకొకటి చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా

కేసు పూర్వాపరాలు ఇవి:

ఇస్రోలో శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో రాకెట్లలో వాడే క్రయోజనిక్ ఇంజన్ల తయారీ కోసం భారతదేశం కృషి చేస్తున్న రోజలవి. దీనికి నంబి నారాయణ్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే 1994లో కొందరు కావాలని కుట్ర చేసి దేశద్రోహంలో నంబి నారాయణ్ ను ఇరికించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేరళ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దేశం కోసం శ్రమించిన శాస్త్రవేత్తపై దేశద్రోహి ముద్ర వేసింది అనాటి ప్రభుత్వం. మాల్దీవులకు చెందిన ఓ మహిళ ద్వారా క్రయోజనిక్ టెక్నాలజీని పాకిస్తాన్ కు అందచేస్తున్నారని నంబిపై ఆరోపణలు మోపారు. దాదాపుగా 50 రోజలు పాటు జైల్లో చిత్రహింసలు అనుభవించారు నంబి.

కేరళ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. అయితే అప్పటి మీడియా నిజానిజాలు తెలుసుకోకుండా నంబిని ఓ దేశద్రోహిగా చిత్రీకరించాయి. నంబితో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర అవమానాలు ఎదర్కోవాల్సి వచ్చింది. 1996లో సీబీఐ నంబి నారాయణ్ తో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో మరోసారి ఈ కేసును ఓపెన్ చేసేందుకు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తిరస్కరించింది. ఇస్రో అంతర్గత విచారణలో కూడా ఎలాంటి క్రయోజనిక్ సమాచారం లీక్ కాలేదని తేలింది.

2018 తనపై అక్రమంగా కేసు పెట్టిన కేరళ ప్రభుత్వంపై నంబి నారాయణ్ కేసు పెట్టారు. సుప్రీంకోర్టు నంబికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని 2018లో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం రూ.50 లక్షలే కాకుండా రూ. 1.30 లక్షలు ఇస్తామని ప్రకటించింది. 2019లో ఎన్డీయే ప్రభుత్వం నంబి నారాయణ్ ను ‘పద్మ భూషణ్’ తో సత్కరించింది. నంబి అరెస్ట్ వల్ల భారత్ ఎప్పుడో పొందాల్సిన క్రయోజనిక్ టెక్నాలజీ చాలా ఆలస్యం అయిందని శాస్త్రవేత్తల అభిప్రాయం.