NTV Telugu Site icon

India map: ఇండియా మ్యాప్‌ని తప్పుగా చూపించిన ఇజ్రాయిల్.. పొరపాటుని గ్రహించి తొలగింపు…

Israel India

Israel India

India map: భారతదేశ మ్యాప్‌ని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం తప్పుగా చూపిండటంతో విమర్శలు ఎదుర్కొంది. పలువురు నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పించారు. భారత్ ఎప్పుడూ ఇజ్రాయిల్‌తో నిలుస్తుంది, ఇజ్రాయిల్ భారత్‌తో ఉందా..? అని పలువురు ప్రశ్నించారు. పొరపాటుని గమనించిన రాయబార కార్యాలయం వెంటనే తప్పుగా చూపించిన మ్యాప్‌ని వెబ్‌సైట్ నుంచి తొలగించింది.

జమ్మూ కాశ్మీర్‌ని తప్పుగా చిత్రీకరించిన భారత మ్యాప్‌ని ఇజ్రాయిల్ తొలగించింది. భారతదేశంలో ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ.. మ్యాప్ తొలగించబడిందని, ఇది వెబ్‌సైట్ ఎడిటర్ పొరపాటు అని చెప్పారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో ఒక నెటిజన్ లేవనెత్తారు. ‘‘భారతదేశం ఇజ్రాయెల్‌తో నిలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ భారతదేశంతో నిలుస్తుందా? ఇజ్రాయెల్ అధికారిక వెబ్‌సైట్‌లోని భారతదేశ మ్యాప్‌ను (జమ్మూ మరియు కాశ్మీర్‌పై శ్రద్ధ వహించండి) గమనించండి’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన రూవెన్ అజర్..‘‘వెబ్‌సైట్ ఎడిటర్ పొరపాటు. గమనించినందుకు ధన్యవాదాలు. మ్యాప్ తొలగించబడింది’’అని రిఫ్లై ఇచ్చారు. పొరపాటుని వెంటనే గమనించి మ్యాప్‌ని తీసేసిన ఇజ్రాయిల్ చురుకైన చర్యపై భారత నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్-ఇజ్రాయిల్ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

Read Also: Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో ధరణి పోర్టల్ రద్దు.. త్వరలో కొత్త చట్టం

జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అవిభాజిత అంతర్భాగమని పలుమార్లు మన దేశం ప్రకటించింది. చాలా సార్లు అంతర్జాతీయ వేదికలపై ఇదే విషయాన్ని చెప్పింది. ఈ సమస్యలో మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ ముందు నుంచి చెబుతూనే ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్‌కి హిజ్బుల్లా, ఇరాక్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు తలెత్తాయి. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయిల్ హతమార్చిన తర్వాత, మంగళవారం ఇరాన్ భారీ ఎత్తున క్షిపణులతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.